భూపాల్ పల్లి ఎస్సై అత్యుత్సాహం.. రోడ్డుపైనే నిలదీసిన ఆకునూరి (వీడియో)
భూపాలపల్లి జిల్లాకు గతంలో కలెక్టర్గా పనిచేసిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి ఆ జిల్లా కేంద్రంలో టౌన్ ఎస్సైగా పనిచేస్తున్న రామకృష్ణ నడిరోడ్డుపై ఒక లారీ డ్రైవర్ను కొట్టారని డీఎస్పీకి ఫిర్యాదు చేశారు.
దిశ, తెలంగాణ బ్యూరో: భూపాలపల్లి జిల్లాకు గతంలో కలెక్టర్గా పనిచేసిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి ఆ జిల్లా కేంద్రంలో టౌన్ ఎస్సైగా పనిచేస్తున్న రామకృష్ణ నడిరోడ్డుపై ఒక లారీ డ్రైవర్ను కొట్టారని డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. యూనిఫారం లేకుండా ఎస్సై ఈ దౌర్జన్యానికి పాల్పడ్డారని, లాఠీతో విచక్షణారహితంగా కొట్టారని ఆ ఫిర్యాదులో మురళి పేర్కొన్నారు. ప్రజలంతా చూస్తుండగా లాఠీతో కొట్టడాన్ని ప్రశ్నించి నియంత్రించారు. అనంతరం పోలీసు స్టేషన్కు వెళ్ళి స్టేషన్ హౌజ్ ఆఫీసర్తో పాటు డీఎస్పీకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. రాంగ్ రూట్లో లారీ నడుపుతున్నాడన్న కారణంతో డ్రైవర్ను శుక్రవారం సాయంత్రం ఎస్సై యూనిఫారం లేకుండానే లాఠీకి పనిచెప్పారని పేర్కొన్నారు.
బాధిత యువకుడిని స్టేషన్కు తీసుకెళ్ళిన ఆకునూరి మురళి చట్టవిరుద్ధంగా ప్రవర్తించిన ఎస్సై రామకృష్ణపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో శాఖాపరమైన యాక్షన్ కూడా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గతంలో పెట్టీ కేసుల విషయంలో స్టేషన్కు వెళ్ళిన మహిళల పట్ల కూడా ఎస్సై రామకృష్ణ దురుసుగా ప్రవర్తించినట్లు స్థానికులు వాపోయారని, కొట్టడంతో పాటు అసభ్య పదజాలంతూ దూషించడం ఆయన స్వభావం అనే తీరులో పేర్కొన్నారని డీఎస్పీకి ఆకునూరి మురళి వివరించారు. దురుసుగా ప్రవర్తించిన ఎస్సైపై కేసు బుక్ చేసి చర్యలు తీసుకోవాలని డీఎస్పీ, ఇన్స్పెక్టర్ను మురళి డిమాండ్ చేశారు.