ఆర్చరీ వరల్డ్ కప్లో స్వర్ణం గెలిచిన తెలుగు తేజం

ఆర్చరీ వరల్డ్ కప్‌లో కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్‌లో సురేఖ- ఒజస్ ప్రవీణ్ డియోటలే‌ జోడీ స్వర్ణం దక్కించుకుంది.

Update: 2023-04-22 12:24 GMT

అంటాల్యా : టుర్కియేలో జరుగుతున్న ఆర్చరీ వరల్డ్ కప్‌లో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ అదరగొట్టింది. కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్‌లో స్వర్ణం దక్కించుకుంది. ఈ కేటగిరీలో ప్రారంభం నుంచి సురేఖ- ఒజస్ ప్రవీణ్ డియోటలే‌ జోడీ సత్తాచాటగా.. ఫైనల్లోనూ మెరిసింది. శనివారం జరిగిన తుది పోరులో భారత జోడీ చైనీస్ తైపీ ద్వయాన్ని చిత్తు చేసి విజేతగా నిలిచింది. సురేఖ-ప్రవీణ్ జంట 159-154 తేడాతో చెన్ యి-హ్సువాన్, చెన్ చీహ్-లున్ జోడీపై గెలుపొందింది. ఫైనల్‌లో సురేఖ జోడీ ఆరంభం నుంచే ఆధిపత్యం ప్రదర్శించింది.

తొలి రెండు సెట్లలో 38-40 పాయింట్ల చొప్పున పైచేయి సాధించింది. మూడో సెట్ 40-40తో సమంగా నిలిచినప్పటికీ.. నాలుగో సెట్‌ను 38-39తో సాధించి విజేతగా నిలిచింది. దాంతో ఈ వరల్డ్ కప్‌లో భారత్ ఖాతాలో తొలి స్వర్ణం చేరింది. అలాగే, వరల్డ్ కప్‌ కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్ కేటగిరీలో సురేఖ‌కు ఇది రెండో గోల్డ్ మెడల్. గతేడాది పారిస్‌లో స్వర్ణం గెలుచుకుంది.

Tags:    

Similar News