రాజస్థాన్‌కు వరుణుడి దెబ్బ

ఐపీఎల్-17లో వర్షం కారణంగా మరో మ్యాచ్ రద్దైంది. ఆదివారం రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరగాల్సిన చివరి లీగ్ మ్యాచ్ వర్షార్పణమైంది.

Update: 2024-05-19 17:49 GMT

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-17లో వర్షం కారణంగా మరో మ్యాచ్ రద్దైంది. ఆదివారం రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరగాల్సిన చివరి లీగ్ మ్యాచ్ వర్షార్పణమైంది. ఈ సీజన్‌లో వర్షం కారణంగా రద్దైన మూడో మ్యాచ్ ఇది. మ్యాచ్ ప్రారంభానికి ముందు నుంచే వర్షం పడటంతో టాస్ ఆలస్యమైంది. రాత్రి 10 గంటల తర్వాత వర్షం ఆగిపోవడంతో గ్రౌండ్ సిబ్బంది మైదానాన్ని సిద్ధం చేశారు. అంపైర్లు 10 :30 గంటలకు టాస్ వేశారు. వర్షంతో మ్యాచ్ సమయం కొట్టుకుపోవడంతో రెండు ఇన్నింగ్స్‌లను ఏడు ఓవర్ల చొప్పున కుదించారు. మ్యాచ్ ప్రారంభమయ్యే సమయానికి వర్షం మళ్లీ రావడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు. ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. కోల్‌కతా 20 పాయింట్లతో అగ్రస్థానంలో నిలువగా.. రాజస్థాన్ 17 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది.

ఎలిమినేటర్‌కు రాజస్థాన్

రాజస్థాన్ క్వాలిఫయర్-1 ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. కేకేఆర్‌పై గెలిచి ఉంటే రాజస్థాన్ 18 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచేది. అప్పుడు అగ్రస్థానంలో ఉన్న కోల్‌కతాతో క్వాలిఫయర్-1లో తలపడేది. అయితే, మ్యాచ్ రద్దవడంతో హైదరాబాద్‌తో సమంగా 17 పాయింట్లతో నిలిచిన రాజస్థాన్.. మెరుగైన నెట్‌రన్‌రేట్ లేకపోవడంతో మూడో స్థానానికే పరిమితమైంది. ఈ నెల 22న జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో బెంగళూరుతో రాజస్థాన్ తలపడనుంది. 

Tags:    

Similar News