సెలెక్షన్ ట్రయల్స్‌కు సైనా దూరం..

ఈ ఏడాది జరగనున్న ఆసియన్ గేమ్స్ కోసం నిర్వహించ తలపెట్టిన సెలక్షన్ ట్రయల్స్‌కు భారత టాప్ షట్లర్ సైనా నెహ్వాల్ దూరం కానుంది.

Update: 2023-05-01 16:15 GMT

హైదరాబాద్: ఈ ఏడాది జరగనున్న ఆసియన్ గేమ్స్ కోసం నిర్వహించ తలపెట్టిన సెలక్షన్ ట్రయల్స్‌కు భారత టాప్ షట్లర్ సైనా నెహ్వాల్ దూరం కానుంది. ఫిట్‌నెస్ సమస్యలున్నాయని ఆమె చెబుతోంది. ఈ ట్రయల్స్ మే 4వ తేదీ నుంచి 7వ తేదీ వరకు గుత్తా జ్వాల అకాడమీలో జరగనున్నాయి. కాగా సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు చైనాలోని హాంగ్‌ఝౌలో ఆసియన్ గేమ్స్ జరుగుతాయి. ‘ఫిట్‌నెస్ సమస్యల కారణంగా సైనా నెహ్వాల్ సెలెక్షన్ ట్రయల్స్‌లో పాల్గొనడం లేదు. అంతేకాకుండా పురుషుల జోడీ కుశాల్ రాజ్, ప్రకాశ్ రాజ్ కూడా దూరమయ్యారు’ అని బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బాయ్) కార్యదర్శి సంజయ్ మిశ్రా తెలిపారు.

సైనా చివరిసారిగా ది ఓర్లాన్స్ మాస్టర్స్‌లో పాల్గొనింది. చాలా కాలంగా గాయాలతో బాధపడుతున్న ఈ మాజీ నెంబర్ వన్ జనవరిలో జరిగిన బ్యాడ్మింటన్ ఏషియా మిక్స్‌డ్ టీమ్ చాంపియన్‌షిప్ ట్రయల్స్‌కు, అంతకుముందు కామన్వెల్త్ గేమ్స్ ట్రయల్స్‌కు కూడా దూరమైంది. ఈ ట్రయల్స్‌లో పురుషుల సింగిల్స్ విభాగానికి ముగ్గురిని, మహిళల సింగిల్స్ విభాగానికి ముగ్గురిని, రెండు మిక్స్‌డ్ డబుల్స్ జోడీలను, ఒక పురుషుల డబుల్స్, ఒక మహిళల డబుల్స్ జోడీని ఎంపిక చేస్తారు.

Tags:    

Similar News