అతడి స్పిన్ను ఎదుర్కొనేందుకు ఆసీస్ స్కెచ్.. డూప్ను రంగంలోకి దించిన ఆసీస్
భారత్, ఆస్ట్రేలియా మధ్య బోర్డర్- గవాస్కర్ సిరీస్లో భాగంగా వచ్చే వారం నుంచి 4 టెస్టు మ్యాచ్ల సిరీస్ ప్రారంభంకానుంది.
దిశ, వెబ్డెస్క్: భారత్, ఆస్ట్రేలియా మధ్య బోర్డర్- గవాస్కర్ సిరీస్లో భాగంగా వచ్చే వారం నుంచి 4 టెస్టు మ్యాచ్ల సిరీస్ ప్రారంభంకానుంది. ఈ సిరీస్లో తొలి టెస్ట్ మ్యాచ్ ఫిబ్రవరి 9న నాగ్పూర్లో జరగనుంది. ఇందుకోసం ఆస్ట్రేలియా బెంగళూరులో సన్నాహాలు ప్రారంభించింది. కాగా, భారత గడ్డపై అశ్విన్ను ధీటుగా ఎదుర్కొనేందుకు ఆసీస్ మైండ్ బ్లోయింగ్ స్కెచ్ వేసింది. ఈ పర్యటనలో ప్రధానంగా రవిచంద్రన్ అశ్విన్ నుంచి ముప్పు ఉంటుందని గ్రహించిన కంగారూలు.. అచ్చం అశ్విన్ లాగే బౌలింగ్ చేసే మహేశ్ పితియాతో బంతులు వేయించుకుని స్పిన్ను సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రాక్టీస్ చేస్తున్నారు.
దాదాపు రెండు నెలల పాటు సాగే ఈ సుదీర్ఘ పర్యటన కోసం ఆస్ట్రేలియా జట్టు భారత్ చేరుకుంది. బెంగళూరులో సాధన చేస్తున్న ఆసీస్ జట్టు తమ క్యాంప్కు మహేశ్ పితియాను పిలిపించుకుంది. మహేశ్ పితియా బరోడా జట్టుకు చెందిన ఆటగాడు. అశ్విన్ను తలపించే బౌలింగ్ యాక్షన్తో అందరి దృష్టిని ఆకర్షించాడు. అతడి బౌలింగ్లో సాధన చేయడం ద్వారా టెస్టుల్లో అశ్విన్ను సమర్థంగా ఎదుర్కోవాలన్నది ఆసీస్ ప్రణాళిక. నెట్ ప్రాక్టీస్లో భాగంగా ఆసీస్ బ్యాటర్లు మహేశ్ బౌలింగ్ను ఎదుర్కొంటూ కసరత్తులు చేస్తున్నారు. ఆసీస్ స్లార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ మహేష్ బౌలింగ్లో భారీ షాట్లు ఆడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.