భారత అథ్లెట్ల పతకాల పంట
ఏషియన్ అండర్-20 అథ్లెటిక్స్ చాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల పతకాల పంట కొనసాగుతోంది.
దిశ, స్పోర్ట్స్ : దుబాయ్లో జరుగుతున్న ఏషియన్ అండర్-20 అథ్లెటిక్స్ చాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల పతకాల పంట కొనసాగుతోంది. మూడో రోజైన శుక్రవారం ఐదు పతకాలు భారత్ ఖాతాలో చేరాయి. పురుషుల హ్యామర్ త్రోలో హర్షిత్ కుమార్ 66.70 మీటర్ల ప్రదర్శనతో స్వర్ణం సాధించాడు. అదే ఈవెంట్లో ప్రతీక్(65.97 మీటర్లు) కాంస్యం దక్కించుకున్నాడు. అలాగే, 4x400 మీటర్ల మిక్స్డ్ రిలే ఈవెంట్లో అభిరామ్, కనిస్టా టీనా, నవ్ప్రీత్ సింగ్, సాండ్రమోల్ సాబులతో కూడిన భారత జట్టు 3:24.86 సెకన్లలో రేసును ముగించి రజతం గెలుచుకుంది. మహిళల 800 మీటర్ల ఈవెంట్లో లక్షిత 2:07.10 సెకన్లలో గమ్యాన్ని చేరుకుని రజత పతకం కైవసం చేసుకుంది. అలాగే, మహిళల 400 మీటర్ల హర్డిల్స్లో శ్రీయా రాజేశ్ 59.20 సెకన్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్యం సాధించింది.