గత చరిత్రకు ఘనమైన సాక్ష్యం ‘పొట్లపల్లి’

దిశ, కరీంనగర్: కాకతీయుల కాలంలో నిర్మాణం జరిగిన శివాలయాల ఆనవాళ్లు పొట్లపల్లి గ్రామంలో వెలుగులోకి వస్తున్నాయి. కాలగర్భంలో కలిసిపోయిన అలనాటి రాజుల కట్టడాలకు సజీవ సాక్ష్యంగా నిలిచే ఈ గ్రామంలో నేటికి ఆనాడు నిర్మించిన ఆలయాల ఉనికి బయటపడుతూనే ఉంది. తాజాగా ఇంటిని నిర్మిస్తున్న క్రమంలో పానవట్టం బయటపడింది. దీంతో గతంలో ఇక్కడ నిర్మించిన ఆలయం మరోటి వెలుగులోకి వచ్చినట్టయింది. కాకతీయుల పరిపాలించిన కాలంలో శైవమతస్థులు పొట్లపల్లిలో పంచమఠ పీఠాన్ని ఏర్పాటు చేసి 300 ఏళ్లు పరిపాలించినట్టు […]

Update: 2020-04-22 05:13 GMT

దిశ, కరీంనగర్: కాకతీయుల కాలంలో నిర్మాణం జరిగిన శివాలయాల ఆనవాళ్లు పొట్లపల్లి గ్రామంలో వెలుగులోకి వస్తున్నాయి. కాలగర్భంలో కలిసిపోయిన అలనాటి రాజుల కట్టడాలకు సజీవ సాక్ష్యంగా నిలిచే ఈ గ్రామంలో నేటికి ఆనాడు నిర్మించిన ఆలయాల ఉనికి బయటపడుతూనే ఉంది. తాజాగా ఇంటిని నిర్మిస్తున్న క్రమంలో పానవట్టం బయటపడింది. దీంతో గతంలో ఇక్కడ నిర్మించిన ఆలయం మరోటి వెలుగులోకి వచ్చినట్టయింది. కాకతీయుల పరిపాలించిన కాలంలో శైవమతస్థులు పొట్లపల్లిలో పంచమఠ పీఠాన్ని ఏర్పాటు చేసి 300 ఏళ్లు పరిపాలించినట్టు ఇక్కడ లభ్యమైన ఆధారాలు చెబుతున్నాయి. జైనుల క్షేత్రంగా భాసిల్లిన ఈ గ్రామంలో ఆనాటి కట్టడాలు గత వైభవపు ఆనవాళ్లకు సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయి.

క్రీస్తు శకం 1066 సంవత్సరంలో పశ్చిమ చాణక్యరాజు త్రైలోక్య మల్లన్న దేవరాయ కాలం నాటి శిలాశాసనం పొట్లపల్లి గ్రామ గత చరిత్రను చెప్తోంది. 1055 నుండి 1075 సంవత్సరాల మధ్య కాకతీయుల వంశానికి చెందిన మొదటి ప్రోలరాజు పొట్లపల్లిలో శివాలయం నిర్మించారని చరిత్రకారుల పరిశోధనలో తేలింది. ఈ గ్రామంలో ఇంటి నిర్మాణం కోసం పునాదులు తవ్వుతుండగా ఆనాటి శివాలయాల ఉనికి బయటపడింది. రుద్రమదేవి పారిపాలనలో ఇక్కడ పెద్ద ఎత్తున శివాలయాల నిర్మాణం జరిగినట్టు తెలుస్తోంది. దాదాపు వెయ్యి ఆలయాలను ఇక్కడ నిర్మించారని, ఇందుకోసం హుస్నాబాద్ సమీపంలోని పందిళ్ల గ్రామంలో పందిళ్లు వేసుకని నివాసం ఉంటూ పొట్లపల్లిలో నిర్మాణాలు జరిపారని చెప్తుంటారు. పందిళ్లు వేసుకుని జీవనం సాగించినందునే ఈ గ్రామానికి పందిళ్ల అనే గ్రామంగా పేరుపడిపోయింది. రాణి రుద్రమదేవి స్వయంగా పందిళ్లలో మకాం వేసి ఆలయాల నిర్మాణ పర్యవేక్షణ చేశారని కూడా తెలుస్తోంది. ఈ ప్రాంతంలోని ఎల్లమ్మగుట్ట సమీపంలో ఐదు తలలతో నాగుల విగ్రహాలు, నాగదేవతను ఆరాధిస్తూ ప్రతిష్టించిన ఏడు నాగులమ్మల విగ్రహాలు ఉన్నాయి.

క్రీస్తుపూర్వం 230 నుండి క్రీస్తుశకం 100 వరకు శాతవాహనుల పరిపాలనలో ఉన్న పొట్లపల్లి గ్రామంలో 400 బ్రాహ్మణ కుటుంబాలు నివాసం ఉండేవని తెలుస్తోంది. ఎల్లమ్మగుట్ట సమీపంలో బృహత్ కాలం నాటి మానవులకు సంబంధించిన సమాధులు వెలుగులోకి వచ్చాయి. ఈ సమాధులు క్రీస్తు పూర్వం 2500 సంవత్సరాల నాటివని పరిశోధకులు అంచనా వేశారు. కాకతీయుల తర్వాత పరిపాలనలో మార్పులతో ఈ ఆలయాలు ఆదరణకు నోచుకోకుండా పోవడంతో కాలగర్భంలో కలిసిపోయాయి. అయితే ఈ గ్రామంలో కొత్త నిర్మాణాలు చేపట్టినప్పుడల్లా ఆనాటి ఆలయాల ఆనవాళ్లు బయటపడుతున్నాయి. తాజాగా ఒకరు ఇంటి నిర్మాణం కోసం తవ్వకాలు జరుపుతుండగా పానవట్టం బయటపడింది. ఈ పానవట్టం త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగాన్ని పోలి ఉందని స్థానికులు చెప్తున్నారు. లాక్‌డౌన్ కారణంగా చరిత్ర పరిశోధకులు గ్రామానికి వెళ్లే పరిస్థితి లేపోవడంతో నిర్దిష్టంగా తెలియరావడం లేదు. కానీ తాజాగా బయటపడ్డ పానవట్టం శతాబ్దాల క్రితం నాటిదేనని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.

Tags: Kakatiyas, Shiva temples, Potlapally village, Rani Rudramadevi, Trimbakeshwar jyotirlinga, Panavattam

Tags:    

Similar News