సమస్యలపై బీజేపీ.. అభివృద్ధి పేరిట టీఆర్ఎస్
దిశ, వరంగల్ తూర్పు: రానున్న వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బల్దియాపై జెండా ఎగుర వేసేందుకు అధికార పార్టీతోపాటు ప్రతిపక్ష పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. రెండు నెలల్లో వరంగల్ నగరపాలక సంస్థ పాలక వర్గం పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో ఎవరికి వారు పోటీ పడి ముందస్తు ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. ఇంటింటి ప్రచారంలో టీఆర్ఎస్ దూసుకెత్తుండగా ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బీజేపీ అట్టడుగు వర్గాలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తోంది. జీహెచ్ఎంసీ రిజల్ట్ రిపీట్ కావొద్దని.. హైదరాబాద్లో […]
దిశ, వరంగల్ తూర్పు: రానున్న వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బల్దియాపై జెండా ఎగుర వేసేందుకు అధికార పార్టీతోపాటు ప్రతిపక్ష పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. రెండు నెలల్లో వరంగల్ నగరపాలక సంస్థ పాలక వర్గం పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో ఎవరికి వారు పోటీ పడి ముందస్తు ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. ఇంటింటి ప్రచారంలో టీఆర్ఎస్ దూసుకెత్తుండగా ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బీజేపీ అట్టడుగు వర్గాలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తోంది.
జీహెచ్ఎంసీ రిజల్ట్ రిపీట్ కావొద్దని..
హైదరాబాద్లో ముందస్తు ఎన్నికలకు పోయి బంగపడిన టీఆర్ఎస్.. అలాంటి తప్పులు దొర్లకుండా పక్కా వ్యూహంతో ముందుకు సాగుతోంది. మార్చి 14న వరంగల్ నగర పాలక సంస్థ పాలక వర్గం పదవీ కాలం ముగియనుంది. ఈ రెండు నెలల్లో ప్రజలకు మరింత చేరువయ్యేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇంటింటికీ తిరుగుతూ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికీ తెలిసేలా ప్రచారం చేపట్టారు. శుక్రవారం దశమి తిథి కావడంతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వరంగల్ తూర్పు, పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 24, 27 డివిజన్లలో ప్రజా సంక్షేమ ప్రగతి యాత్ర పేరుతో ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించారు. 24వ డివిజన్లో చేపట్టిన యాత్రలో స్థానిక ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పాల్గొనగా, 27వ డివిజన్లో దాస్యం వినయ్భాస్కర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రానున్న ఎన్నికలకు సమాయత్తం కావాలంటూ కార్యకర్తలకు మంత్రి దిశా నిర్దేశం చేశారు. మరో తెలంగాణ ఉద్యమంలా ప్రతి ఇంటిలో టీఆర్ ఎస్ చేపట్టిన సంక్షేమ పథకాలను తెలిసేలా ప్రచారం చేయాలని సూచించారు. రోజుకు ఒక్కో డివిజన్లో కలియ తిరుగుతూ ఇంటింటి ప్రచారం నిర్వహించేలా పక్కా ప్రణాళికలు రూపొందించారు.
హైదరాబాద్ వ్యూహమే..
వరంగల్ నగర పాలక సంస్థపై కాశాయం జెండా ఎగుర వేయాలన్న లక్ష్యంతో బీజేపీ అడుగులు వేస్తోంది. హైదరాబాద్లో అనుసరించిన వ్యూహాన్నే ఇక్కడ అనుసరించి లబ్ధి పొందాలని చూస్తున్నారు. అందులో భాగంగానే బీజేపీ నాయకుల పర్యటనల పరంపర కొనసాగుతోంది. స్థానిక నాయకులకు ఎప్పటికప్పుడు పలు సూచనలు, సలహాలు ఇస్తూ వారిని ప్రజలకు చేరువ చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. వరుస పర్యటనలతో నాయకులకు, కార్యకర్తలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు.
20 ఏండ్ల తర్వాత..
2000 సంవత్సరంలో బల్దియాపై జెండా ఎగురవేసిన బీజేపీ అదే ఒరవడిని కొనసాగించి తిరిగి 2021లో కూడా అధికారం హస్తగతం చేసుకునేలా కార్యకర్తలను సిద్ధం చేస్తున్నారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యలపై కూడా ఎప్పటికప్పుడు గళమెత్తుతూ రాస్తారోకోలు, ధర్నాలు నిర్వహిస్తున్నారు. అవకాశం దొరికినప్పుడల్లా పాలక పార్టీని ఎండగడుతూ బీజేపీని ప్రజలకు మరింత చేరువ చేస్తున్నారు. నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో అధిక శాతం నిధులు కేంద్రం విడుదల చేసినవేనంటూ ప్రచారం చేస్తున్నారు. నగర అభివృద్ధి కేంద్రం చలువే అంటూ ఉపన్యాసాలు దంచుతున్నారు.
సమావేశాలతో కాంగ్రెస్..
కాంగ్రెస్ పార్టీ బహిరంగ ప్రచారం నిర్వహించకపోయినా అడపాదడపా కార్యకర్తల సమావేశాలను ఏర్పాటు చేసుకొని భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తోంది. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నాయకులు చర్చిస్తున్నారు. గతంలో పార్టీ కార్యకర్తలుగా ఉన్న వారిని గుర్తించి తిరిగి పార్టీలోకి తీసుకొచ్చేందుకు వారితో లోపాయికారిగా చర్చలు జరుపుతున్నారు. పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలంటే కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని గుర్తు చేసుకుంటున్నారు.