నేను బతికున్నంత వరకు ఆ రిజర్వేషన్లు అమలయ్యే ప్రసక్తే లేదు: మోడీ సెన్సేషనల్ కామెంట్స్

బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే బీసీ, ఎస్టీ, ఎస్సీ, ఓబీసీ రిజర్వేషన్లు రద్దు చేసి.. భారతదేశాన్ని రిజర్వేషన్ రహిత దేశంగా మార్చాలని కుట్ర

Update: 2024-04-30 12:44 GMT

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే బీసీ, ఎస్టీ, ఎస్సీ, ఓబీసీ రిజర్వేషన్లు రద్దు చేసి.. భారతదేశాన్ని రిజర్వేషన్ రహిత దేశంగా మార్చాలని కుట్ర చేస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తోందన్న ప్రతిపక్షాల వ్యాఖ్యలకు ప్రధాని మోడీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం తెలంగాణలో పర్యటిస్తోన్న మోడీ.. జహీరాబాద్ లోక్ సభ సెగ్మెంట్ పరిధిలో బీజేపీ అల్లాదుర్గం వద్ద ఏర్పాటు చేసిన సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను బతికి ఉన్నంతవరకూ రాజ్యాంగాన్ని కాపాడుతానని మాట ఇచ్చారు. రాజ్యాంగం కల్పించిన దళిత, ఓబీసీల రిజర్వేషన్లకు తాను బతికి ఉన్నంతవరకూ కట్టుబడి ఉంటానని చెప్పారు. నేను ఉన్నంత వరకు రాజ్యాంగ వ్యతిరేకమైన ముస్లిం రిజర్వేషన్లు అమలయ్యే ప్రసక్తే లేదని మోడీ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.

రాజ్యాంగంపై మోడీని శంకించే వ్యక్తులను దేశ ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు. రాజ్యాంగాన్ని పదే పదే సవరణలు చేసిన పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని దుయ్యబట్టారు. రాజ్యాంగంపై తనను శంకించడానికి కాంగ్రెస్ నేతలకు సిగ్గుండాలని మోడీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మాకు రాజ్యాంగమే ధర్మ గ్రంథమని తేల్చి చెప్పిన ప్రధాని.. తాను గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు రాజ్యాంగాన్ని ఏనుగు అంబారీపై ఊరేగించానని గుర్తు చేశారు. ఏనుగు అంబారీపై రాజ్యాంగం వెళ్తుంటే తాను కింద నడుచుకుంటూ వెళ్లానని చెప్పారు. పార్లమెంట్‌లో అడుగుపెట్టిన రోజే రాజ్యాంగానికి కట్టుబడ్డానని పేర్కొన్నారు. రాజ్యాంగం నాకు భారతం, రామాయణం, బైబిల్, ఖురాన్‌తో సమానమని మోడీ స్పష్టం చేశారు. మూడోసారి అధికారంలోకి వచ్చాక 75వ రిపబ్లిక్ డే ఉత్సవాలను ఘనంగా నిర్వహించి.. కాంగ్రెస్ నిజస్వరూపాన్ని బట్టబయలు చేస్తామని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Read More...

మార్ఫింగ్ వీడియో చేసిన వాళ్ళని వదిలిపెట్టం: ప్రధాని మోడీ 

Tags:    

Similar News