AP Politics: సమస్యలు పట్టించుకోని ఎమ్మెల్యే తెల్లం బాలరాజు

నియోజకవర్గ ప్రజల్ని, ప్రజా సమస్యల్ని పట్టించుకోకుండా గాలికి వదిలేసిన వ్యక్తి పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు

Update: 2024-04-28 10:18 GMT

దిశ, కుక్కునూరు: నియోజకవర్గ ప్రజల్ని, ప్రజా సమస్యల్ని పట్టించుకోకుండా గాలికి వదిలేసిన వ్యక్తి పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అంటూ పోలవరం నియోజకవర్గ ఎన్డీయే కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి చిర్రి బాలరాజు ఘాటు విమర్శలు చేశారు.

ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా.. కుక్కునూరు మండలంలో శ్రీధర వేలేరు నుంచి అన్ని పంచాయితీలను కవర్ చేస్తూ, గొమ్ముగూడెం వరకు ఏలూరు లోక్‌సభ అభ్యర్థి పుట్టా మహేష్‌యాదవ్‌తో కలిసి చిర్రి బాలరాజు రోడ్డు షో నిర్వహించారు. ఈ రోడ్డు షోలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ నేపథ్యంత ప్రజలు అభ్యర్థులకు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో చిర్రి బాలరాజు మాట్లాడుతూ.. తెల్లం బాలరాజు అసమర్థుడు కావడంతోనే అతని భార్యకు టికెట్ ఇచ్చారని, వారి కుటుంబంలో ఎవరూ ఎన్నికల పోటీలో ఉన్న ఓడించడానికి నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారని చిర్రి బాలరాజు చెప్పారు.

ఎమ్మెల్యే ఏనాడు కూడా ప్రజల సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడిన దాఖలాలు లేవని వ్యాఖ్యానించారు. కనీసం పోలవరం ముంపు మండలాల్లో గోదావరి వరదల సమయంలో నిర్వాసితుల వైపు తిరిగి కూడా చూడలేదని చిర్రి ఆరోపించారు. రహదారులకు కనీసం గోతులు కూడా పూడ్చలేని ఎమ్మెల్యే మనకు అవసరమా అంటూ ప్రశ్నించారు.

సమస్యలు పక్కన పెట్టి, రోజు వాలీబాల్ ఆడుకునే వ్యక్తి ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అని, అతని కుటుంబ సభ్యులు అసెంబ్లీలోకి అడుగు పెట్టడానికి అనర్హులని పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో జనసేన మండల అధ్యక్షుడు ముల్లిశెట్టి యుగంధర్, టిడిపి మండల అధ్యక్షుడు ముల్లిశెట్టి నాగేశ్వరరావు, టిడిపి సీనియర్ నాయకులు కోటగిరి సత్యనారాయణ, ఉప సర్పంచి పిచ్చుక రాజు తదితరులు పాల్గొన్నారు.

Similar News