శవమై కనిపించిన తమిళనాడు కాంగ్రెస్ నేత

తమిళనాడులో గత రెండు రోజులుగా కనిపించకుండా పోయిన కాంగ్రెస్ నాయకుడు శనివారం శవమై కనిపించారు.

Update: 2024-05-04 14:07 GMT

దిశ, నేషనల్ బ్యూరో: తమిళనాడులో గత రెండు రోజులుగా కనిపించకుండా పోయిన కాంగ్రెస్ నాయకుడు శనివారం శవమై కనిపించారు. తిరునల్వేలి తూర్పు జిల్లా శాఖ అధ్యక్షుడిగా ఉన్నటువంటి కేపీకే జయకుమార్ గురువారం నుంచి మిస్ అయ్యారు. దీంతో ఆయన కుమారుడు మరుసటి రోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి వారు ఆయన కోసం వెతుకుతున్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఆయన తన సొంత వ్యవసాయ క్షేత్రంలో శవంగా కనిపించారు. పోలీసులు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మృతిపై దర్యాప్తు చేస్తున్నారు.

అయితే జయకుమార్‌ది హత్యా లేక ఆత్మహత్యా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. కానీ ఆయన చనిపోవడానికి ముందు సుసైడ్ నోట్ రాసినట్లుగా ఒక లేఖ దొరికింది, అయితే దానిలో రాసి ఉన్న మ్యాటర్ ఆయన చేతి రాతాదా..? కాదా ? అని విచారణ చేస్తున్నారు. ఒకవేళ అందులో రాసి ఉన్న చేతి రాత జయకుమార్‌దే అయితే దానిలో రాసి ఉన్న ప్రముఖుల పేర్ల ఆధారంగా వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఆయన మృతికి గల కారణాలను తెలుసుకోడానికి ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేసేందుకు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసు సూపరింటెండెంట్ తెలిపారు.

ఈ అనుమానాస్పద మృతిపై రాష్ట్రంలోని అధికార డీఎంకే ప్రభుత్వంపై అన్నాడీఎంకే మండిపడింది. ఈ సంఘటన రాష్ట్రంలో శాంతిభద్రతలు తీవ్రంగా క్షీణించడాన్ని సూచిస్తోందని, అన్నాడీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి కె పళనిస్వామి బాధ్యులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

Similar News