రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి

రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు

Update: 2024-05-05 09:56 GMT

దిశ, నేషనల్ బ్యూరో: రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఆదివారం ఉదయం 7 గంటల ప్రాంతంలో ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్ వేపై బనాస్ నది వంతెన సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సవాయి మాధోపూర్‌లోని గణేష్ ఆలయాన్ని దర్శించడానికి ఒక కుటుంబం కారులో వెళ్తున్న క్రమంలో గుర్తు తెలియని వాహనం వీరి కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, కారులో వెనక కూర్చున ఇద్దరు చిన్నారులకు గాయాలయ్యాయి.

ప్రమాదం జరిగిన సమాచారాన్ని అందుకున్న వెంటనే పోలీసులు, అంబులెన్స్ ఘటన స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు ప్రారంభించారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు. ఈ ప్రమాదంలో మనీష్ శర్మ, అతని భార్య అనిత, కైలాష్ శర్మ, అతని భార్య సంతోష్, సతీష్ శర్మ, పూనమ్‌తో సహా ఆరుగురు కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోయారని బోన్లీ పోలీస్ స్టేషన్ అధికారులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. గాయపడిన చిన్నారులు మనన్, దీపాలి శర్మలను ఆసుపత్రిలో చేర్పించారు. ప్రమాదానికి కారణమైన వాహన యజమానిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చేపట్టారు.

Similar News