రాహుల్ బాబా, సమస్య మీతోనే ఉంది, సీటుతో కాదు: అమిత్ షా
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అమేథీకి బదులుగా రాయ్బరేలీ నుంచి పోటీ చేయడంపై కేంద్ర హోంమంత్రి అమిత్షా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అమేథీకి బదులుగా రాయ్బరేలీ నుంచి పోటీ చేయడంపై కేంద్ర హోంమంత్రి అమిత్షా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గుజరాత్లోని గిరిజనుల ప్రాబల్యం ఉన్న ఛోటాడేపూర్ జిల్లాలోని బోడేలి పట్టణంలో అమిత్షా మాట్లాడుతూ, 'రాహుల్ బాబా, నా సలహా తీసుకోండి. సమస్య మీతోని ఉంది, సీట్లతో కాదు. మీరు రాయ్బరేలీలో కూడా భారీ తేడాతో ఓడిపోతారు. మీరు ఎక్కడికి పారిపోయినా ప్రజలు మిమ్మల్ని కనిపెడతారు' అని మండిపడ్డారు. రాహుల్ గాంధీ అమేథీ నుండి ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు, వయనాడ్ వెళ్ళాడు. ఈసారి వాయనాడ్ నుండి కూడా ఓడిపోతానని గ్రహించాడు కాబట్టి ఆయన అమేథీ నుండి కాకుండా రాయబరేలీ నుంచి కూడా పోటీ చేస్తున్నాడని అమిత్షా అన్నారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ, మోడీకి 2014, 2019లో పూర్తి మెజారిటీ ఉంది. కానీ, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుకబడిన తరగతులకు ఉద్దేశించిన రిజర్వేషన్లను ఆయన ఎప్పుడూ టచ్ చేయలేదు. బీజేపీ అధికారంలో ఉన్నంత వరకు ఎవరూ ముట్టుకోలేరన్నది మోడీ హామీ అని హోంమంత్రి తెలిపారు. శుక్రవారం కాంగ్రెస్ కంచుకోటలు అయినటువంటి అమేథీ, రాయ్బరేలీ అభ్యర్థులను ప్రకటించారు. అమేథీ నుంచి కిశోరీ లాల్ శర్మ నామినేషన్ దాఖలు చేయగా, రాయ్బరేలీ నుంచి రాహుల్ నామినేషన్ వేశారు.