బీజేపీలో చేరిన ప్రముఖ యూట్యూబర్ మనీష్ కశ్యప్
బీహార్కు చెందిన ప్రముఖ యూట్యూబర్ మనీష్ కశ్యప్, ఈరోజు ఉదయం 11 గంటలకు మనోజ్ తివారీ, అనిల్ బలూని సమక్షంలో భారతీయ జనతా పార్టీ (బిజెపి)లో అధికారికంగా చేరారు.
దిశ, వెబ్డెస్క్: 2024 పార్లమెంట్ ఎన్నికల వేళ బీజేపీలో చేరికలతో జోష్ పెరుగుతుంది. ఈ క్రమంలోనే బీహార్కు చెందిన ప్రముఖ యూట్యూబర్ మనీష్ కశ్యప్, ఈరోజు ఉదయం 11 గంటలకు మనోజ్ తివారీ, అనిల్ బలూని సమక్షంలో భారతీయ జనతా పార్టీ (బిజెపి)లో అధికారికంగా చేరారు. గతంలో, కశ్యప్ పశ్చిమ చంపారన్ నియోజకవర్గం నుంచి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు. కాషాయ కండువా కప్పుకున్న తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ... "నేను నిన్న మనోజ్ తివారీ తో కలిసి బీహార్ నుంచి వచ్చాను. వారి వల్ల మాత్రమే నేను జైలు నుంచి బయటకు రావడం సాధ్యం అయింది. నా జీవితంలో చెడ్డ రోజులు ముగిశాయి. కాబట్టి, నేను బీజేపీలో చేరాను. బీహార్ను దోచుకుని, ధ్వంసం చేసిన బీహార్ను మనం బలపరచాలి. అందుకోసం నేను నా వంతుగా కృషి చేస్తాను అని చెప్పుకొచ్చారు.