ముస్లింల కోసం ముజ్రా.. ఇండియా కూటమిపై ప్రధాని మోడీ ఫైర్

దిశ, నేషనల్ బ్యూరో : విపక్ష ఇండియా కూటమిపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ నిప్పులు చెరిగారు.

Update: 2024-05-25 18:45 GMT

దిశ, నేషనల్ బ్యూరో : విపక్ష ఇండియా కూటమిపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ నిప్పులు చెరిగారు. ముస్లిం ఓటుబ్యాంకును ప్రసన్నం చేసుకునేందుకు ఇండియా కూటమి ముజ్రా ఆడుతోందని ఆయన విమర్శలు గుప్పించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లకు గండికొట్టి.. ముస్లింలకు ఆ కోటాను కట్టబెట్టేందుకు ఇండియా కూటమి స్కెచ్ గీస్తోందని ప్రధాని మోడీ ఆరోపించారు. శనివారం బిహార్‌లోని పాటలీపుత్రలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘2024 ఎన్నికల్లో ఒకవైపు 24 గంటలు కష్టపడుతున్న మోడీ.. మరోవైపు 24 గంటలు పచ్చి అబద్ధాలు చెప్పే ఇండియా కూటమి ఉంది. ఎవరిని ఎన్నుకోవాలో మీ ఇష్టం’’ అని ప్రధాని పేర్కొన్నారు. బిహార్‌లోని ప్రధాన విపక్ష పార్టీ రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ)‌పై మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘లాలూ ప్రసాద్ యాదవ్ రాజకీయ పార్టీ(ఆర్జేడీ) గుర్తు లాంతరు. ఆ లాంతరు ఒకే ఇంటికి వెలుగు ఇస్తుంది. ఆ లాంతరు వల్లే ఇప్పుడు బిహార్ మొత్తం చీకట్లో మగ్గుతోంది. అలాంటి లాంతరుకు మరో అవకాశం ఇవ్వొద్దు’’ అని ప్రధాని ఓటర్లను కోరారు.

ప్రధాని మోడీ త్వరగా కోలుకోవాలి.. విపక్షాల కౌంటర్

ప్రధాని మోడీ చేసిన ‘ముజ్రా’ వ్యాఖ్యలపై విపక్ష ఇండియా కూటమి నేతలు భగ్గుమన్నారు. ‘‘ప్రధాని మోడీ మానసిక స్థితికి ఆయన మాటలు అద్దం పడుతున్నాయి. చికిత్సతో మోడీ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాం’’ అని పేర్కొన్నారు. ‘‘ప్రధాని పదవిలో ఉన్నప్పుడు కనీస మర్యాద పాటించాల్సిన బాధ్యత మోడీకి లేదా?’’ అని కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంకాగాంధీ మండిపడ్డారు. ‘‘చరిత్రలో ఏ ప్రధాని అయినా ఇలాంటి పదాలు ఉపయోగించారా? ప్రధాని హోదాను మేం చాలా గౌరవిస్తాం. కానీ ఈ ఎన్నికల్లో ఆయన (మోడీ) అసలు స్వరూపం బయటపడింది. ఈ దేశ ప్రజలకు ప్రతినిధిని అన్న విషయాన్ని ఆయన మర్చిపోతున్నట్లున్నారు. ఇలాగైతే భావితరాలు మన గురించి ఏం చెబుతాయి?’’ అని ప్రియాంక ధ్వజమెత్తారు. రాజ్యాంగపరమైన ఉన్నత పదవిలో ఉన్న మోడీ.. తన మాటలపై నియంత్రణ కోల్పోతున్నారని ఆమ్‌ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్‌ సింగ్‌ పేర్కొన్నారు.

Read More..

భారత రాజ్యాంగాన్ని బీజేపీ ఎప్పటికీ మార్చదు: రాజ్‌నాథ్ సింగ్  

Tags:    

Similar News