Luxury carmaker Audi to hike vehicle prices by up to 1.7 per cent from January

లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి ఇండియా వచ్చే ఏడాది నుంచి తన కార్ల ధరను పెంచుతున్నట్టు బుధవారం ప్రకటించింది.

Update: 2022-12-07 12:59 GMT

న్యూఢిల్లీ: లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి ఇండియా వచ్చే ఏడాది నుంచి తన కార్ల ధరను పెంచుతున్నట్టు బుధవారం ప్రకటించింది. అన్ని మోడళ్ల ధరలను 1.7 శాతం వరకు పెంచుతామని, జనవరి 1 నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నట్టు స్పష్టం చేసింది. నిర్వహణ ఖర్చులు పెరగడం, ఇతర వ్యయభారం కారణంగా పెంపు నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ తెలిపింది. గత కొంతకాలంగా కొనసాగుతున్న సరఫరా సమస్యల వల్లే ఖర్చులు పెరిగాయని, తప్పనిసరి పరిస్థితుల్లో వినియోగదారులపై కొంత భారం వేస్తున్నట్టు ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ థిల్లాన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆడి ఇండియా ప్రస్తుతం భారత మార్కెట్లో ఆడి ఏ సిరీస్ కార్లు, క్యూ సిరీస్, ఆర్ఎస్ సిరీస్ కార్లను, ఈ-ట్రాన్ బ్రాండ్ పేరుతో ఎలక్ట్రిక్ కార్లను విక్రయిస్తోంది. ఇదే సమయంలో మరో కార్ల తయారీ కంపెనీ రెనాల్ట్ ఇండియా కూడా తన కార్ల ధరను జనవరి నుంచి పెంచనున్నట్టు ప్రకటించింది. ఎంత మొత్తం పెంచనున్నది త్వరలో వెల్లడించనున్నట్టు పేర్కొంది. కాగా, నిర్వహణ, ఇతర ఇన్‌పుట్ ఖర్చులు అధికం కావడంతో ఇప్పటికే మారుతీ సుజుకి, టాటా మోటార్స్ కంపెనీలు జనవరి నుంచి కార్ల ధరలు పెంచనున్నట్టు స్పష్టం చేశాయి.

Tags:    

Similar News