కాంగ్రెస్కు ఓటు వేయడం వృథా: అరవింద్ కేజ్రివాల్
ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ గుజరాత్ ప్రజలకు కీలక విజ్ఞప్తి చేశారు.
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ గుజరాత్ ప్రజలకు కీలక విజ్ఞప్తి చేశారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓట్లు వేసి వృథా చేసుకోవద్దని ఆయన కోరారు. దీనికి బదులుగా ఆప్కు ఓటు వేయాలని కేజ్రివాల్ అన్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీనే బీజేపీతో నేరుగా పోరులో ఉందని చెప్పారు. సోమవారం ఆయన అహ్మదాబాద్లో మీడియాతో మాట్లాడారు.
'కాంగ్రెస్కు ఓట్ల షేరింగ్ 13 శాతం కంటే తక్కువగా ఉండడమే కాకుండా కేవలం 4-5 సీట్లను మాత్రమే గెలుస్తుంది. ఈ ఎన్నికల్లో ఆప్, బీజేపీ మధ్య మాత్రమే నేరుగా పోటీ ఉంది' అని అన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ హర్డ్కోర్ ఓటర్లు తమ మనసు మార్చుకుని ఆప్కు ఓటు వేయాలని కోరారు. రాష్ట్రంలో రెండు రకాల ఓటర్లు ఉన్నారని చెప్పారు. ఒకరేమో బీజేపీని అసహ్యించుకునేవారని, మరొకరు 27 ఏళ్ల తప్పుడు పాలనతో విసిగిపోయినవారని అన్నారు. రెండో కేటగిరీ వాళ్లు ఆప్కే ఓటు వేస్తారని ధీమా వ్యక్తం చేశారు. కాగా, ఇప్పటికే ఆప్ 178 మంది అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే.