రూ.18.6 కోట్ల బంగారాన్ని అక్రమంగా తీసుకెళ్తు పట్టుబట్ట ఆఫ్ఘన్ దౌత్యవేత్త

అక్రమంగా బంగారాన్ని తీసుకెళ్తూ విమానాశ్రయాల్లో ఇటీవల కాలంలో చాలా మంది పట్టుబట్టారు.

Update: 2024-05-04 13:21 GMT

దిశ, నేషనల్ బ్యూరో: అక్రమంగా బంగారాన్ని తీసుకెళ్తూ విమానాశ్రయాల్లో ఇటీవల కాలంలో చాలా మంది పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో అధికారులు క్షుణ్ణంగా అందరిని తనిఖీలు చేస్తూ బంగారం స్మగ్లింగ్‌ను పూర్తి స్థాయిలో చెక్ పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ముంబై విమానాశ్రయంలో దుబాయ్ నుంచి భారత్‌కు అక్రమంగా 25 కిలోల బరువున్న (రూ.18.6 కోట్ల)బంగారాన్ని తరలించేందుకు ఆఫ్ఘనిస్థాన్ దౌత్యవేత్త ప్రయత్నించిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన ఏప్రిల్ 25వ తేదీన జరిగింది.

నిఘా వర్గాల సమాచారంతో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు విమానాశ్రయంలో సిబ్బందిని మోహరించారు. ఏప్రిల్ 25న సాయంత్రం 5.45 గంటలకు దుబాయ్ నుంచి ఎమిరేట్స్ విమానంలో ఆఫ్ఘనిస్థాన్ దౌత్యవేత్త జకియా వార్దక్‌, ఆమె కుమారుడితో కలిసి ముంబై విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానం దిగిన వెంటనే వారు గ్రీన్ చానల్ ఉపయోగించి ఎయిర్‌పోర్ట్ బయటకు వెళ్లారు. ఆమె అత్యున్నత పదవిలో ఉన్నవారు కావడంతో తనిఖీల నుంచి మినహాయింపు ఉండటంతో విమానాశ్రయ సిబ్బంది ఆమెను తనిఖీలు చేయకుండానే బయటకు పంపించారు.

అయితే ఎయిర్‌పోర్ట్ ఎగ్జిట్ పాయింట్ వద్ద డీఆర్‌ఐ అధికారులు ఆమెను అడ్డగించి ప్రశ్నించి, పూర్తిగా తనిఖీ చేయగా బ్యాగుల్లో ఎలాంటి బంగారం కనిపించలేదు, అయితే ఆమె ధరించిన లెగ్గింగ్స్, వెయిస్ట్ బెల్ట్, మోకాలి క్యాప్స్‌లో 25 కిలోల బరువున్న బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు. ఆమె కుమారుడి వద్ద ఏం కనిపించలేదు. బంగారానికి సంబంధించిన పత్రాలను చూపించాలని కోరగా ఆమె ఏ పత్రాలను చూపించకపోవడంతో అధికారులు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దౌత్యవేత్త కావడంతో ఆమెను అధికారులు అదుపులోకి తీసుకోలేదు.

Similar News