హిజాబ్ ధరించి మద్యం కొనడానికి వెళ్లిన మహిళ.. తల తీసేస్తామంటూ హెచ్చరిక
హిజాబ్ ధరించి మద్యం కొనడానికి వెళ్లడంతో ఓ మహిళను తల తీసేస్తామంటూ బెదిరించిన ఘటన యూపీలో ముజఫర్నగర్లో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది.
దిశ, వెబ్డెస్క్: హిజాబ్ ధరించి మద్యం కొనడానికి వెళ్లడంతో ఓ మహిళను తల తీసేస్తామంటూ బెదిరించిన ఘటన యూపీలో ముజఫర్నగర్లో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. 30 ఏళ్ల వయసున్న మహిళ మద్యం కొనడానికి షాపుకు వెళ్లగా.. అక్కడున్న బాకు అలియాస్ షహనవాజ్(40), అదిల్ అహ్మద్ (30), అతడి సోదరుడు సాజిద్ అహ్మద్(35)అనే ముగ్గురు వ్యక్తులు అడ్డుకున్నారు. ‘‘మద్యం కొనడానికి ఇక్కడికెందుకు వచ్చావు. నా గురించి నీకు తెలియదు. నేను ఇప్పటికే చాలా సార్లు జైలుకు వెళ్లి వచ్చాను. ఇప్పటికిప్పుడే నీ తల నరికేస్తాను’’ అంటూ ఆమెను బెదిరించారు.
అనంతరం ఆమెను విడిచి పెట్టారు. ఈ విషయాన్ని ఆమె పోలీసులకు తెలుపగా.. ఆ ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాళ్లను త్వరలోనే మేజిస్ట్రేట్ ముందు హాజరు పరుస్తామని ముజఫర్నగర్ డీఎస్పీ విక్రమ్ ఆయుష్ వెల్లడించారు. ‘‘శాంతి భద్రతలకు విఘాతం కలిగించినందుకు, మహిళను హెచ్చరించినందుకు వారిపై కేసులు నమోదు చేశామని, ఇద్దరిపై స్థానికంగా గతంలో నేర కార్యకలాపాలకు సంబంధించి ఇతర కేసులు ఉన్నాయని నగర్ కొత్వాలి ఎస్హెచ్ఓ మహావీర్ సింగ్ తెలిపారు.