రుతుస్రావ సెలవులు మహిళల హక్కు!

దేశ కార్మిక చట్టాలు అనేక రకాలైన సెలవులకు సంబంధించిన నిబంధనలు కలిగి ఉన్నప్పటికీ నేటికీ మహిళలకు అత్యవసరమైన ‘రుతు స్రావ సెలవు

Update: 2024-05-14 01:00 GMT

దేశ కార్మిక చట్టాలు అనేక రకాలైన సెలవులకు సంబంధించిన నిబంధనలు కలిగి ఉన్నప్పటికీ నేటికీ మహిళలకు అత్యవసరమైన ‘రుతు స్రావ సెలవుల(మెనుస్ట్రువల్‌ లీవ్‌)’ చట్టాలను చేయడంలో తటపటాయిస్తున్నట్లు విధితమవుతున్నది. లింగ అసమానతల సమాజంలో సహజ శారీరక సమస్య అయిన మెనుస్ట్రువల్‌ సైకిల్‌ మహిళలకు మాత్రమే ఉండంతో పురుష సమాజానికి ఆ సమయంలో మహిళలు పడే మహా వేదనలు అర్థం కావడం లేదు.

సాధారణంగా మహిళలు పీరియడ్స్‌ సమయంలో 3 నుంచి 5 రోజుల పాటు అధిక రక్తస్రావంతో పాటు తీవ్ర కడుపు నొప్పిని అనుభవిస్తూ ఉంటారు. పీరియడ్స్‌ వచ్చాయని మహిళలు బహిరంగంగా చెప్పడానికి ఇష్టపడరు.. కారణం, సమాజం దానిని చులకన భావంతో చూస్తుందని. అందుకే రుతుస్రావ నొప్పిని కడుపు నొప్పిగా కప్పిపుచ్చడానికి లేదా మరో ఇతర అనారోగ్యమని చెప్పడానికి మహిళలు ఇష్టపడతారు. ఆధునిక స్త్రీ పురుష సమాజం రుతు ఆరోగ్యం పట్ల బహిరంగంగా చర్చించడానికి, వారి బాధలను అర్థం చేసుకోవడానికి ముందుకు రావాలి.

తీవ్ర నొప్పితో..

రుతుస్రావ సమయంలో మహిళలకు ‘డిస్మెనోరియా’ అనబడే తీవ్ర నొప్పి కలుగుతుంది. అధిక శాతం మహిళలు పీరియడ్స్ సమయంలో ఏకాగ్రతను హరింపజేస్తూ, సాధారణ పనితీరుకు అంతరాయము కలిగిస్తూ, కొన్ని అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఆ సమయంలో మహిళలు భావోద్వేగ, ప్రవర్తనపరమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ సమయంలో అధిక శాతం మహిళలు ఆందోళన, ఉద్రిక్తత, అణగారిన మానసిక స్థితులు, మూడ్‌ స్వింగ్‌, ఏకాగ్రత లోపం, సామాజిక ఉపసంహరణ, నిద్ర లేమి, కడుపు నొప్పి లాంటి అనారోగ్యాలను అనాదిగా అనుభవిస్తున్నారు. బహిష్టు సమయ బాధలను మన ఇంట్లోని మహిళలు అనుభవిస్తున్నప్పటికీ కార్యాలయాల్లో పనిచేసే మహిళలు పడుతున్న బాధలను మాత్రం చులకనగా చేసి చూడడం, అమానవీయంగా ఎగతాళిగా ప్రవర్తించడం మానుకొని బహిష్టు కాలపు సెలవుల అవసరం గూర్చి చర్చించడం సత్వర అవసరంగా భావించాలి.

పరిశుభ్రతపై అవగాహన లేక..

బహిష్టు అనేది ఒక కళంక క్రియగా, మహిళలు ఆ సమయంలో అందరికీ దూరంగా, ఓ మూలన కూర్చోవాలనే అనారోగ్యకర సంప్రదాయం, మూఢ నమ్మకాలు, సామాజిక కట్టుబాట్లు, మహిళల రుతుస్రావ వ్యక్తిగత పరిశుభ్రత పట్ల అవగాహన లేమి, బహిషుల సమస్యల పట్ల చిన్న చూపు నేటికీ కొనసాగడం అత్యంత విచారకరం. సువిశాల భారతంలో 35.5 కోట్ల మహిళలు రుతుస్రావ వయసులో ఉన్నారని, వీరిలో 75 శాతం మహిళలు నేటికీ అపరిశుభ్ర గుడ్డలను పీరియడ్స్‌ సమయంలో ఉపయోగిస్తున్నారని తెలుస్తున్నది. రుతుస్రావ సమస్యలను తీసుకొని పురుషాధిక్య సమాజం మహిళాలోకాన్ని అబలుగా ముద్ర వేయడంతో లింగ వివక్ష మరింత పెరుగుతున్నట్లు తోస్తున్నది.

బిల్లుపై చర్చలు జరిగినప్పటికీ..

1912లో కేరళ రాష్ట్రంలోని ఒక పాఠశాల విద్యార్థినులకు బహిష్టు సెలవులు మంజూరు చేయడం జరిగినప్పటికీ మెనుస్ట్రువల్‌ బెనిఫిట్స్‌ బిల్‌ ద్వారా రెండు రోజుల సెలవు మంజూరు చేయాలనే చట్టం తీసుకురావడంలో భారత ప్రభుత్వం నేటికీ సఫలం కాలేదు. 1992 నుంచి బీహార్‌ ప్రభుత్వం 2 రోజుల బహిష్టు సెలవుల హక్కును కల్పించింది. 2023లో కేరళ ప్రభుత్వం 18 ఏండ్లు దాటిన విద్యార్థులకు బహిష్టు సెలవుల వెసులుబాటు కల్పించారు. గోజూప్‌ అండ్‌ కలిచర్‌ మెషిన్‌, స్విగ్గీ, బైజూస్, జోమాటో‌ లాంటి ప్రైవేట్‌ కంపెనీలు బహిష్టు సెలవులను పరిమిత రోజులు అనుమతించడం హర్షదాయకం.

2024 సాధారణ ఎన్నికల్లో తమిళనాడు డీఎంకే పార్టీ రుతుస్రావ సెలవుల సమస్యను కేంద్రం దృష్టి తెస్తామని తమ మేనిఫెస్టోలో పొందుపరిచింది. 2017, 2021ల్లో పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టిన రుతుస్రావ సెలవుల ప్రైవేట్‌ బిల్లులు చర్చలకు మాత్రమే పరిమితం అయ్యింది. కానీ దీనిని ఆమోదించలేదు. అయితే, ఈ సాధారణ ఎన్నికల మానిఫెస్టోల్లో బీజేపీ ‘సంకల్ప ప్రత్’లోగాని, కాంగ్రేస్‌ ‘న్యాయ ప్రత్’లోగాని మహిళల బహిష్టు సెలవుల ప్రత్యేక ప్రస్తావన లేకపోవడం గమనార్హం.

డా. బుర్ర మధుసూదన్ రెడ్డి

9949700037

Tags:    

Similar News