వారాంతం స్వల్ప లాభాలతో సరిపెట్టిన సూచీలు!

దేశీయ ఈక్విటీ మార్కెట్లు వారాంతం స్వల్ప లాభాలతో సరిపెట్టాయి. ఉదయం నుంచి నష్టాల్లో కొనసాగిన సూచీలు చివరి గంటలో స్వల్పంగా కోలుకున్నాయి.

Update: 2023-04-21 12:01 GMT

ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వారాంతం స్వల్ప లాభాలతో సరిపెట్టాయి. ఉదయం నుంచి నష్టాల్లో కొనసాగిన సూచీలు చివరి గంటలో స్వల్పంగా కోలుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలకు తోడు ద్రవ్యోల్బణం, ఆర్థిక మాంద్యం ఆందోళనల నేపథ్యంలో మదుపర్ల సెంటిమెంట్ బలహీనపడింది. ముఖ్యంగా మెటల్, ఆటో, రియల్టీ రంగాల్లో పెరిగిన అమ్మకాల ఒత్తిడి కారణంగా స్టాక్ మార్కెట్లు రోజంతా ఒడిదుడుకుల్లో కదలాడాయి.

ఇదే సమయంలో ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష(ఎంపీసీ) సమావేశంలో ఏకగ్రీవంగా కీలక రేట్లను యథాతథంగా ఉంచాలని నిర్ణయించినప్పటికీ, అధిక ద్రవ్యోల్బణం విషయంలో సభ్యులు ఆందోళన చెందుతున్నారని శుక్రవారం విడుదలైన ఆర్‌బీఐ మినిట్స్ నివేదికలో గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. దీనికితోడు విదేశీ పెట్టుబడిదారులు ఈక్విటీల నుంచి నిధులను ఉపసంహరించుకోవడంతో సూచీలు నీరసించాయి.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 22.71 పాయింట్లు లాభపడి 59,655 వద్ద, నిఫ్టీ అత్యల్పంగా 0.40 పాయింట్లు పెరిగి 17,624 వద్ద ముగిశాయి. నిఫ్టీలో మీడియా, ఎఫ్ఎంసీజీ, ఐటీ రంగాలు రాణించాయి. రియల్టీ, మెటల్, ఆటో రంగాలు బలహీనపడ్డాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఐటీసీ, టీసీఎస్, విప్రో, ఏషియన్ పెయింట్, హెచ్‌సీఎల్ టెక్, హెచ్‌డీఎఫ్‌సీ కంపెనీల షేర్లు లాభాలను సాధించాయి. టెక్ మహీంద్రా, మారుతీ సుజుకి, టాటా స్టీల్, అల్ట్రా సిమెంట్, టాటా మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 82.10 వద్ద ఉంది.

ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఐటీసీ మార్కెట్ విలువ పరంగా రూ. 5 లక్షల కోట్ల మార్కును చేరుకుంది. దేశీయంగా ఈ ఘనత సాధించిన 11వ కంపెనీగా ఐటీసీ నిలిచింది. ఈ ఏడాది ఇప్పటివరకు కంపెనీ షేర్ ధర రికార్డు స్థాయిలో 21 శాతం పెరగడం గమనార్హం. శుక్రవారం మార్కెట్లు ముగిసే సమయానికి ఐటీసీ షేర్ ధర దాదాపు 2 శాతం పుంజుకుని రూ. 408.25 వద్ద ముగిసింది. దాంతో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ. 5.07 లక్షల కోట్లకు చేరుకుంది.

Also Read...

ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ.50 వేల లోన్‌ పైగా 7 శాతం సబ్సిడీ 

Tags:    

Similar News