బిల్‌డెక్స్, పేయూ కొనుగోలు ఒప్పందం రద్దు!

ప్రముఖ డిజిటల్ చెల్లింపుల సంస్థ బిల్‌డెక్స్‌తో జరిగిన కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్టు పేయూ మాతృసంస్థ ప్రోసస్ ఎన్‌విLatest Telugu News

Update: 2022-10-03 13:36 GMT

న్యూఢిల్లీ: ప్రముఖ డిజిటల్ చెల్లింపుల సంస్థ బిల్‌డెక్స్‌తో జరిగిన కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్టు పేయూ మాతృసంస్థ ప్రోసస్ ఎన్‌వి సోమవారం ప్రకటనలో వెల్లడించింది. గతేడాది ఆగష్టులో బిల్‌డెస్క్‌ను సుమారు రూ. 35 వేల కోట్లకు కొనుగోలు చేయనున్నట్టు ప్రోసస్ ఎన్‌వి తెలిపింది. తన ఫిన్‌టెక్ కంపెనీ పేయూ కోసం ఈ కొనుగోలు చేసినట్టు పేర్కొంది. ఆ సమయంలో బిల్‌డెస్క్, పేయూ మధ్య జరిగిన కొనుగోలు ఒప్పందం భారత వినియోగ ఇంటర్నెట్ రంగంలో అతిపెద్ద కొనుగోలుగా నిలిచింది.

అయితే, తాజాగా ఈ ఒప్పందం జరిగేందుకు కొన్ని షరతులు ఉన్నాయని, దీనికి సెప్టెంబర్ 30లోపు అంగీకారం కుదరాల్సి ఉండగా, ఆ ప్రక్రియ పూర్తవలేదని ప్రోసస్ వివరించింది. ఇరు సంస్థల మధ్య జరిగిన ఒప్పందంలోని నిబంధనల ప్రకారం కొనుగోలు ప్రక్రియ రద్దయినట్టు స్పష్టం చేసింది. గత నెలలోనే ఈ ఒప్పందానికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) నుంచి అనుమతి లభించడం గమనార్హం. గ్లోబల్ కంపెనీ అయిన ప్రోసస్ ఎన్‌వి అంతర్జాతీయంగా తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది. భారత్‌లో కూడా స్విగ్గీ, బైజూస్, మీషో లాంటి కంపెనీల్లో పెట్టుబడులను నిర్వహిస్తోంది.

Tags:    

Similar News