ఈవీల కోసం ఒక్కటైన ఛార్జ్ ప్లస్ జోన్, మహీంద్రా!
దేశీయ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా తన ఎలక్ట్రిక్ ఎస్యూవీల కోసం ఛార్జింగ్ స్టేషన్ల నెట్వర్క్ను ఏర్పాటు చేసేందుకు..Latest Telugu News
న్యూఢిల్లీ: దేశీయ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా తన ఎలక్ట్రిక్ ఎస్యూవీల కోసం ఛార్జింగ్ స్టేషన్ల నెట్వర్క్ను ఏర్పాటు చేసేందుకు ఈవీ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఛార్జ్ ప్లస్ జోన్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. త్వరలో మహీంద్రా సంస్థ తన కొత్త ఈవీ ఎస్యూవీలను మార్కెట్లోకి తీసుకురానుంది.
దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో డీసీ ఫాస్ట్ చార్జర్ లను ఏర్పాటు చేయడంతో పాటు నిర్వహణ కోసం ఇరు కంపెనీలు ఒప్పందం చేసుకున్నట్టు వెల్లడించాయి. దీంతోపాటు, భాగస్వామ్యంలో భాగంగా ఛార్జింగ్ స్టేషన్లను వెతుక్కునేందుకు అవసరమైన నావిగేషన్ చూపించే ఈ-మొబిలిటీ సొల్యూషన్స్ను కూడా అందజేయనున్నారు. దీనివల్ల ఛార్జింగ్ నెట్వర్క్ను సజావుగా యాక్సెస్ చేయడానికి అవకాశం ఉంటుందని ఇరు కంపెనీలు వివరించాయి.
ఛార్జ్ ప్లస్ జోన్ కంపెనీ ఇప్పటికే 650 ఛార్జింగ్ సెంటర్లలో 1,450 ఛార్జింగ్ పాయింట్లను అందుబాటులో ఉంచింది. రోజుకు ఐదు వేల వాహనాలకు ఛార్జింగ్ సదుపాయాలను కల్పిస్తున్నామని కంపెనీ పేర్కొంది. తాజా ఒప్పందం ద్వారా మహీంద్రా సంస్థ ఈవీ వినియోగదారులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 25 నగరాల్లో 2,500 పైగా ఛార్జింగ్ పాయింట్ల ద్వారా ఛార్జింగ్ సదుపాయాలు పొందుతారని వెల్లడించింది.