బీమా ప్రకటనల నిబంధనలు మరింత కఠినతరం: ఐఆర్‌డీఏఐ!

బీమా ప్రకటనలకు సంబంధించిన నిబంధనలను మరింత కఠినతరం చేయాలని బీమా నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐ ప్రతిపాదించింది.

Update: 2023-05-07 13:02 GMT

న్యూఢిల్లీ: బీమా ప్రకటనలకు సంబంధించిన నిబంధనలను మరింత కఠినతరం చేయాలని బీమా నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐ ప్రతిపాదించింది. బీమా ఉత్పత్తుల ప్రమోషన్ కోసం మీడియా ప్రచారాలను రూపొందించడం, అటువంటి యాడ్స్‌ను ఆమోదించడంలో ఇన్సూరెన్స్ కంపెనీల సీనియర్ మేనేజ్‌మెంట్‌కు కీలక బాధ్యతలను అప్పగించడం ద్వారా నిబంధనలను కలిగి ఉండాలని తెలిపింది. దీనికోసం ఇన్సూరెన్స్ యాడ్స్, డిస్‌క్లోజర్ విషయంలో 2021 నిబంధనలలో ఐఆర్‌డీఏఐ సవరణ చేయాలని అభిప్రాయపడింది. ఈ సవరణ ప్రకారం, ప్రతి బీమా సంస్థ మార్కెటింగ్, ఆర్థికవ్యవహారాలు, కంప్లయన్స్ విభాగాల నుంచి తప్పనిసరిగా కనీసం ముగ్గురు సభ్యులతో కూడిన ప్రకటనల కమిటీని ఏర్పాటు చేయాలి.

ప్రధానంగా వినియోగదారుల కోసం యాడ్స్ రూపకల్పన, ఆమోదానికి సీనియర్ మేనేజ్‌మెంట్‌పై ఎక్కువ బాధ్యతలను అప్పగించడమే ఈ సవరణ లక్ష్యమని ఐఆర్‌డీఏఐ వెల్లడించింది. సవరణ తర్వాత ఏర్పడే యాడ్స్ కమిటీ ప్రోడక్ట్ మేనేజ్‌మెంట్ కమిటీకి రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని ఐఆర్‌డీఏఐ తన నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది. అడ్వర్టైజ్‌మెంట్ కమిటీ సిఫార్సులను పరిశీలించిన అనంతరం, ప్రకటనలను ఆమోదించేందుకు లేదా తిరస్కరించేందుకు బీమా ఉత్పత్తి నిర్వహణ కమిటీకి తుది అధికారం ఉంటుందని పేర్కొంది. 

Tags:    

Similar News