తగ్గిన దేశీయ బొమ్మల ఎగుమతులు

పరిశ్రమలో తప్పనిసరి నాణ్యతా నియంత్రణ ఉత్తర్వులు అమలైనప్పటికీ పరిశ్రమ పెద్దగా ప్రయోజనం పొందలేదని జీటీఆర్ఐ అభిప్రాయపడింది.

Update: 2024-05-07 12:30 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ బొమ్మల పరిశ్రమ ఒకప్పుడు చైనా బొమ్మలతో నిండిపోయేవి. అయితే, స్థానిక బొమ్మల తయారీ ప్రోత్సాహానికి ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలతో పరిశ్రమ క్రమంగా వృద్ధి చెందుతోంది. అయితే, తాజాగా ఎకనమిక్ థింక్ ట్యాంక్ జీటీఆర్ఐ నివేదిక ప్రకారం, 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత బొమ్మల ఎగుమతులు స్వల్పంగా తగ్గాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో 153.89 మిలియన్ డాలర్ల(రూ. 1,285 కోట్లు) నుంచి 2023-24లో 152.34 మిలియన్ డాలర్ల(రూ. 1,272 కోట్ల)కు స్వల్పంగా తగ్గాయి. పరిశ్రమలో తప్పనిసరి నాణ్యతా నియంత్రణ(క్వాలిటీ కంట్రోల్) ఉత్తర్వులు అమల్లోకి వచ్చినప్పటికీ భారత బొమ్మల పరిశ్రమ పెద్దగా ప్రయోజనం పొందలేదని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్(జీటీఆర్ఐ) అభిప్రాయపడింది. ప్రధానంగా స్థానిక పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు, భద్రతను పెంచే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు తీసుకున్నప్పటికీ దేశీయ ఎగుమతులు భారీ స్థాయిలో పెంచలేకపోయాయని జీటీఆర్ఐ పేర్కొంది. ఇదే సమయంలో దిగుమతులు 2022-23లో 62.37 మిలియన్ డాలర్ల(రూ. 521 కోట్ల) నుంచి 2023-24లో 64.92 మిలియన్ డాలర్ల(రూ. 542 కోట్ల)కు పెరిగాయి. భారత్ చైనా నుంచి వచ్చే నాసిరకం దిగుమతులను నియంత్రించగలిగినప్పటికీ దేశం నుంచి ఎక్కువ ఎగుమతులను సాధించలేకపోయిందని జీటీఆర్ఐ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ అన్నారు. ముఖ్యంగా చైనా నుంచి వచ్చే నాసిరకం బొమ్మల దిగుమతులను అరికట్టేందుకు, దేశీయ పరిశ్రమ బలోపేతానికి ప్రభుత్వం 2020లో కీలక చర్యలు తీసుకుంది. అయితే, పరిశ్రమ అభివృద్ధికి మరింత సమగ్రమైన విధానం అమలు చేయాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు.  

Tags:    

Similar News