సీసీఐ ఆదేశాలు పాటించేందుకు సిద్ధమైన గూగుల్!
ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్కు సంబంధించి గుత్తాధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తోందనే దానిపై సుప్రీంకోర్టు తన అప్పీల్ను నిరాకరించడంతో గూగుల్ సీసీఐ ఆదేశాలను పాటించేందుకు సిద్ధమైంది.
న్యూఢిల్లీ: ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్కు సంబంధించి గుత్తాధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తోందనే దానిపై సుప్రీంకోర్టు తన అప్పీల్ను నిరాకరించడంతో గూగుల్ సీసీఐ ఆదేశాలను పాటించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ప్రకారం భారత్లోని ఫోన్ తయారీదారులతో వ్యాపార ఒప్పందాలను సవరిస్తున్నట్టు బుధవారం ప్రకటనలో వెల్లడించింది.
భారత్లోని స్థానిక చట్టాలు, నిబంధనలకు కట్టుబడి ఉండాలనే నిబద్ధతను పాటించడానికి సిద్ధంగా ఉంటాము. ఆండ్రాయిడ్, గూగుల్ ప్లే విషయంలో సీసీఐ ఆదేశాలకు అనుగుణంగా మార్పులు చేస్తామని గూగుల్ ఓ ప్రకటనలో తెలిపింది. పూర్తిస్థాయిలో మార్పులు చేయడం సంక్లిష్టమైన ప్రక్రియ. దీనికోసం తమ భాగస్వాములు, ఒరిజినల్ పరికరాల తయారీదారుల నుంచి మద్దతు అవసరమని గూగుల్ పేర్కొంది.
ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్కు సంబంధించి గూగుల్ గుత్తాధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తోందంటూ సీసీఐ రూ.1337 కోట్ల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. దీనిపై జాతీయ కంపెనీ లా అప్పీలేట్ ట్రైబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ), సుప్రీంకోర్టులకు వెళ్లగా రెండుచోట్లా గూగుల్కు ఊరట లభించకపోవడంతో తాజా నిర్ణయం తీసుకుంది.