అదానీ పోర్ట్స్ లాభం రూ.2 వేల కోట్లు.. రూ.6 డివిడెండ్
అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ గురువారం తన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది
దిశ, బిజినెస్ బ్యూరో: అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ గురువారం తన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. మార్చి 2024లో ముగిసిన ఆర్థిక త్రైమాసికంలో కంపెనీ లాభం 76 శాతం పెరిగి రూ.2,040 కోట్లను ఆర్జించింది. ఇది క్రితం ఏడాది ఇదే కాలంలో రూ.1,158 కోట్లుగా నమోదైంది. కార్యకలాపాల ద్వారా ఆదాయం గత ఏడాది మార్చి త్రైమాసికంలో రూ. 5,797 కోట్లు కాగా, ఇప్పుడు అది 19 శాతం పెరిగి రూ.6,897 కోట్లకు చేరుకుంది. త్రైమాసికంలో వడ్డీకి ముందు ఆదాయాలు, పన్నులు, తరుగుదల,రుణ విమోచన (EBITDA) 24 శాతం పెరిగి రూ. 4,045 కోట్లకు చేరుకుంది. ఏడాది ప్రాతిపదికన అదానీ పోర్ట్స్ 28 శాతం వృద్ధితో రూ.26,711 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. ముఖ్యంగా పోర్ట్ల వ్యాపార ఆదాయంలో 30 శాతం, లాజిస్టిక్స్ వ్యాపారంలో 19 శాతం పెరుగుదల మద్దతునిచ్చింది. దీంతో 2023-24 ఆర్థిక సంవత్సరానికి కంపెనీ రూ. 2 ముఖ విలువ కలిగిన ఈక్విటీ షేరుకు రూ.6 డివిడెండ్ ప్రకటించింది.
ఇటీవల కొనుగోలు చేసిన గోపాల్పూర్ పోర్ట్తో పాటు, ప్రస్తుత సంవత్సరంలో విజింజం పోర్ట్ని ప్రారంభించడం ద్వారా వ్యాపారాన్ని విస్తరిస్తున్నాము, త్వరలో మరిన్ని పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని APSEZ హోల్-టైమ్ డైరెక్టర్ అండ్ సీఈఓ అశ్వనీ గుప్తా అన్నారు. ఇది భారతదేశంలో 13 పోర్ట్లు, టెర్మినల్స్ను నిర్వహిస్తోంది, గుజరాత్లోని ముంద్రాలో దేశంలోని అతిపెద్ద కంటైనర్ హ్యాండ్లింగ్ పోర్ట్ను కూడా కలిగి ఉంది.