MLA Mekapati Vikram Reddyకి షాక్.. విచారణకు ట్రైబల్ కమిషన్ ఆదేశం

Update: 2023-05-12 12:23 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఫిర్యాదుపై నేషనల్ ట్రైబల్ కమిషన్ స్పందించింది. వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డిపై విచారణకు ఆదేశించింది. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపల్ చైర్ పర్సన్ అయిన గిరిజన మహిళ వెంకటరమణమ్మను పత్రికా సమావేశంలో నిలబెట్టి అవమానించారని వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. ఆత్మకూరుకు ప్రథమ మహిళ వెంకటరమణమ్మ యానాది కులానికి చెందిన మహిళ అయినందుకే ఎమ్మెల్యే ఆమెకు కుర్చీ వేయలేదని ఆరోపించారు. తనకు కుర్చీ వేయాలని రెండుసార్లు అడిగినప్పటికీ ఆమెకు కుర్చీ ఏర్పాటు చేయలేదని, దీంతో ఆమె ఎంతో మనోవేదనకు గురై కన్నీళ్లు పెట్టుకుందని వర్ల రామయ్య తెలిపారు.

ఈ అమానుష ఘటనపై ఏప్రిల్ 28న నేషనల్ ట్రైబల్ కమిషన్‌లో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. గిరిజన మహిళను నిలబెట్టి అవమానించడం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం మార్గదర్శకాలను ఉల్లంఘించడమేనని లేఖలో ఆరోపించారు. గిరిజన మహిళను అవమానించిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం సెక్షన్ -3 ప్రకారం శిక్షార్హం అని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదును విచారణకు స్వీకరిస్తున్నామని వర్ల రామయ్యకు కమిషన్ సమాచారం ఇచ్చిందని, ఎమ్మెల్యేగా ఉన్న మేకపాటి విక్రమ్ రెడ్డి చట్టాలను ఉల్లంఘించడం దారుణమని వర్ల రామయ్య అన్నారు. గిరిజన మహిళకు న్యాయం చేసే విధంగా ట్రైబల్ కమిషన్ ఫిర్యాదుపై విచారణకు ఆదేశించడం స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వం, వైసీపీ ప్రజాప్రతినిధులు తమ ధోరణి మార్చుకుని చట్టబద్దంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. కులాలకు అతీతంగా ఎవరికి ఇవ్వాల్సిన గౌరవం వారికివ్వాలని వర్ల రామయ్య కోరారు.

ఇవి కూడా చదవండి:

AP BJP: కాళ్లతో తొక్కి హేయంగా ప్రవర్తిస్తారా?  

Tags:    

Similar News