Mla Sudhakarbabu: నాకు రక్షణ కల్పించండి

టీడీపీ ఎమ్మెల్యేలు తనపై చేసిన దాడి నేపథ్యంలో రక్షణ కల్పించాలని వైసీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు కోరారు...

Update: 2023-03-20 11:57 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: టీడీపీ ఎమ్మెల్యేలు తనపై చేసిన దాడి నేపథ్యంలో రక్షణ కల్పించాలని వైసీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు కోరారు. అసెంబ్లీలో జరిగిన దాడిపై సభలో ఆయన ప్రసంగించారు. టీడీపీ సభ్యులు తనపై దాడికి పాల్పడ్డారన్నారు. తమపై దాడి చేసిందే కాకుండా సభ బయటకు వెళ్లి తామే టీడీపీ దళిత ఎమ్మెల్యే అయిన డోల బాల వీరాంజనేయస్వామిపై దాడికి పాల్పడినట్లు ఆరోపిస్తున్నారని అన్నారు.

దాడి చేసి అవమానపర్చారు..

‘టీడీపీ సభ్యులు దాడి చేసి అవమానపరిచారు. కానీ మేము దాడి చేసి అగౌరపరిచినట్టు దుష్ప్రచారం చేస్తున్నారు. దళితులను రాజకీయంగా ఆర్థికంగా ఎదగకుండా సమాధి చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు.’ అని ఆరోపించారు. ఈ దాడిపై రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా నిరసన తెలుపుతామని టీజేఆర్ సుధాకర్ తెలిపారు. దళితులను రాజకీయంగా, ఆర్థికంగా ఎదగనీయకూడదని చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ సభ్యులు తనపై దాడి చేసిన నేపథ్యంలో సభా హక్కుల ఉల్లంఘన చట్టం కింద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దళితులలో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అని చంద్రబాబు గతంలో అన్నారని, అలా అన్నప్పుడు దళితులను బతకనీయరని తాము భావించినట్లు చెప్పారు. చంద్రబాబు హయాంలో దళితులపై ఆర్థిక, రాజకీయ దాడులు ఎన్నో జరిగాయని గుర్తు చేశారు.

అది తలచుకుంటేనే భయమేస్తోంది

నేడు చట్టసభలో సాక్షాత్తు టీడీపీ సభ్యులు తమపై దాడులకు పాల్పడ్డారని గుర్తు చేశారు. తనపై జరిగిన దాడిని తలచుకుంటే భయమేస్తోందన్నారు. రాబోయేది ఎన్నికల సమయమని..ఎన్నికలు సమీపించే కొద్దీ ప్రజల్లో తిరగాల్సిన నేపథ్యంలో తనపై చంద్రబాబు దాడి చేయించే అవకాశం ఉందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో తనకు రక్షణ కల్పించాలని ఎమ్మెల్యే సుధాకర్ బాబు స్పీకర్ తమ్మినేని సీతారాంను కోరారు.

Tags:    

Similar News