Ap News: పట్టాపై జగన్ ఫోటో.. పెడితే తప్పు ఏంటి...!

పట్టాపై జగన్ ఫోటో పెడితే తప్పు ఏంటని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు...

Update: 2024-05-04 16:33 GMT

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: పట్టాపై జగన్ ఫోటో పెడితే తప్పు ఏంటని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. శనివారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. మరుగుదొడ్డిపై ఎన్టీఆర్ బొమ్మ వేశారని, అంటే మరుగుదొడ్డి ఎన్టీఆర్ సొంతమైపోతుందా అని ప్రశ్నించారు. రిజిస్ట్రేషన్ కాగితం భూ యజమాని ఇంట్లో ఉంటుందని, ఎవరిదగ్గరో ఎందుకుంటుందన్నారు. కొందరు రాజకీయ దుర్బుద్ధితో అసత్య ప్రచారం చేస్తున్న మాటల్ని ప్రజలెవ్వరూ నమ్మడం లేదన్నారు. లిటిగేషన్లు తగ్గించడానికి కిందకోర్టు పరిధి ఇందులోంచి తీసేశామని, జిల్లా జడ్జి కేడర్‌లో అథారిటీ ఉందన్నారు. ఆయన తీర్పు ఇచ్చిన తర్వాత కింద కోర్టులో కేసులేస్తుంటే సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లుగా సర్వే నిర్వహిస్తోందని గ్రామ స్థాయిలో జరిగిందని, త్వరలో అర్బన్ స్థాయిలో నిర్వహిస్తామని ప్రకటించారు. బ్రిటిష్ కాలం నాటి రికార్డులు వల్ల లిటిగేషన్లు ఎక్కువయ్యాయన్నారు. సర్వే తర్వాత, ప్రజాభిప్రాయం, ఆ తర్వాత ఆ గ్రామం యాక్ట్‌లోకి వెళ్తుందని, ప్రస్తుతం ఈ చట్టం ఫోర్స్ లేదని మంత్రి బొత్స పేర్కొన్నారు.

వ్యవస్థలో ఎప్పుడూ మార్పులు జరుగుతుంటాయని, ప్రస్తుతం ఈ విషయం కోర్టుల్లో ఉందని, ప్రజాభిప్రాయం తీసుకున్న తర్వాత నిర్ణయం ప్రకటిస్తామని మంత్రి బొత్స తెలిపారు. సామాన్యుల్ని మోసం చేసే పరిస్థితులు లేకుండా దేశవ్యాప్తంగా చట్టాలు తీసుకురావాలని తమ ధ్యేయం అన్నారు. చంద్రబాబు విద్యుత్ బకాయిల్ని డిస్కంలకు ఇవ్వకుండా మంట కలపడంతో తప్పనిసరి పరిస్థితుల్లో చార్జీలు పెంచామని మంత్రి బొత్స తెలిపారు. 

Tags:    

Similar News