పవన్ కళ్యాణ్ గెలిస్తే నా పేరు మార్చుకుంటా ..ముద్రగడ సంచలన వ్యాఖ్యలు

పిఠాపురంలో జనసేనాని పవన్ కళ్యాణ్‌ను ఓడిస్తానని మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముద్రగడ పద్మనాభం సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-04-30 11:32 GMT

దిశ ప్రతినిధి, కాకినాడ: పిఠాపురంలో జనసేనాని పవన్ కళ్యాణ్‌ను ఓడిస్తానని మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముద్రగడ పద్మనాభం సంచలన వ్యాఖ్యలు చేశారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్‌ను ఓడించలేని పక్షంలో నా పేరు మార్చుకుంటానని సవాల్ విసిరారు. అలా జరగకపోతే నా పేరు ముద్రగడ పద్మనాభం కాదని పద్మనాభరెడ్డి అని మార్చుకుంటారని కిర్లంపూడిలో విలేకరుల సమావేశంలో తెలిపారు.

పవన్ కళ్యాణ్ బూతులు మాట్లాడుతున్నారని, విషయం మీద అవగాహన లేకో తెలుసుకోవడానికి ఖాళీ లేకో పవన్ మాట్లాడుతున్నారని విమర్శించారు. తుని రైలు దహనం జరిగినప్పుడు నీ పక్కన ఉన్న జ్యోతుల నెహ్రూ అప్పుడు వైసీపీ లోనే ఉన్నాడని తెలుసుకోమని, తుని రైలు సంఘటనకి చంద్రబాబు కారణమని పవన్ కళ్యాణ్ తెలుసుకోవాలని హితవు పలికారు. పవన్ కళ్యాణ్ నాపై తప్పుడు మాటలు, నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నాడని ధ్వజమెత్తారు.

వైసీపీ కాపు ఎమ్మెల్యేలను తిట్టడానికి పవన్‌కి హక్కు ఏంటని, కాపు ఉద్యమానికి ఎప్పుడు మద్దతు ఎందుకు ఇవ్వలేదన్నారు. కాపుల కోసం నువ్వు ఎందుకు రోడ్డు ఎక్కలేదని ప్రశ్నించారు. ఎమ్మెల్యే పదవి కోసం హైదరాబాద్ నుంచి పిఠాపురం ఎందుకు పారిపోయి వచ్చాడని, అసలు పవన్ కళ్యాణ్ అడ్రస్ ఏంటన్నారు. సినిమాల్లో నటించండి, రాజకీయాలలో కాదని, నీ పార్టీ త్వరలో ప్యాకప్ అవుతుందని జోస్యం చెప్పారు. పిఠాపురంలో నిన్ను తన్ని తరిమేస్తారని హెచ్చరించారు.

Tags:    

Similar News