మరో కొత్త పథకం : సివిల్స్ అభ్యర్థులకు సీఎం జగన్ గుడ్ న్యూస్

వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నవరత్నాలతోపాటు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది.

Update: 2023-09-20 08:19 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నవరత్నాలతోపాటు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో తాము అమలు చేస్తున్న నవరత్నాలు, సంక్షేమ పథకాలనే ప్రధాన అస్త్రంగా చేసుకోవాలని వైసీపీ భావిస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో వైసీపీ ప్రభుత్వం మరో కీలక పథకానికి శ్రీకారం చుట్టింది. సివిల్ సర్వీసెస్‌కు ప్రిపేర్ అయ్యే అభ్యుర్థుల కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ‘జగనన్న సివిల్స్‌ సర్వీసెస్‌ ప్రోత్సాహకం’ పేరుతో కొత్త పథకాన్ని ఏర్పాటు చేశారు. ఈ పథకానికి ఏపీ మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. సివిల్స్‌ ప్రిలిమ్స్‌ ఉత్తీర్ణులైన వారికి రూ.50వేలు, మెయిన్స్‌లో ఉత్తీర్ణులైతే రూ.లక్ష ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ కేబినెట్ సమావేశంలో మంత్రి వర్గం పలు కీలక అంశాలకు ఆమోదం తెలిపింది. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, జీపీఎస్‌ ముసాయిదా, ఏపీ వైద్య విధాన పరిషత్‌ సవరణ బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎస్ అమలుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే ఉద్యోగులు రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా వారి ఆరోగ్యానికి పెద్దపీట వేసేలా కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే ప్రైవేట్ యూనివర్సిటీ చట్టంలో సవరణపై బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

Tags:    

Similar News