ఇదొక చెత్త సెలక్షన్.. ఎవరినో సంతోష పెట్టడానికే ఇలా చేశారు: టీ20 వరల్డ్ కప్ జట్టు ఎంపికపై మాజీల ఆగ్రహం

Update: 2024-05-01 14:52 GMT

దిశ, స్పోర్ట్స్: టీ20 వరల్డ్ కప్‌కు ఎంపిక చేసిన భారత జట్టుపై పలువురు మాజీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా యువ ఆటగాడు రింకూ సింగ్‌కు చోటుదక్కకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మాజీ క్రికెటర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ తన యూట్యూబ్ చానల్‌లో స్పందిస్తూ, ఈ ఎంపికపై తాను ఏమాత్రం సంతోషంగా లేనని తెలిపాడు. ఈ ఏడాది జనవరి వరకు రెండు అర్ధసెంచరీలతో 176స్ట్రైక్‌ రేటుతో ప్రదర్శన కనబర్చిన రింకూ సింగ్‌కు టీ20 ప్రపంచ కప్ జట్టుకు ఎంపిక చేయకపోవడం దారుణమని అభిప్రాయపడ్డాడు. ‘‘రింకూ దక్షిణాఫ్రికాలో గెలిపించగలిగే స్థాయి ఇన్నింగ్స్‌లు ఆడాడు. అఫ్గాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒంటిచేత్తో జట్టును ఆదుకున్నాడు. టీమ్‌కు అవసరమైన ప్రతిసారీ సత్తా చాటాడు. అలాంటి ఆటగాడిని ఎలా పక్కనబెట్టగలిగారు? ఇదో చెత్త సెలక్షన్‌. ఎవరినో సంతోషపెట్టడానికి జట్టును ఎంపిక చేశారు. రింకూను బలిపశువుగా మార్చారు’’ అని అన్నాడు. ఆకాశ్ చోప్రా సైతం రింకూను విస్మరించడంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. టీ20 జట్టులో రింకూ లేకపోవడం ఆశ్చర్యకరమని, కోల్‌కతా జట్టు అతనికి తగినన్ని బ్యాటింగ్ అవకాశాలు ఇవ్వలేదని తెలిపాడు.

హార్దిక్‌కు గవాస్కర్ మద్దతు

మరోవైపు, ఐపీఎల్‌లో అన్ని రకాలుగా విఫలమవుతున్న హార్దిక్ పాండ్యాను జట్టులోకి తీసుకోవడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో మాజీ దిగ్గజం సునిల్ గవాస్కర్ హార్దిక్‌కు మద్దతుగా నిలిచాడు. ఓ మీడియా సంస్థతో గవాస్కర్ బుధవారం మాట్లాడుతూ, ఐపీఎల్‌లో ఆడటం, దేశం కోసం ప్రాతినిధ్యం వహించడానికి చాలా తేడా ఉంటుందని, జాతీయ జట్టుకు ఆడే ప్రతి ఆటగాడూ గర్వపడతాడని తెలిపాడు. హార్దిక్ పాండ్యా విషయంలోనూ ఇదే ఉంటుందని అన్నాడు. ఐపీఎల్‌లో అతని ప్రదర్శన ఎలా ఉన్నా.. భారత జట్టు తరఫున ఆడేటప్పుడు పూర్తి భిన్నమైన మైండ్‌సెట్‌తో గ్రౌండ్‌లోకి అడుగుపెడతాడని అభిప్రాయపడ్డాడు. బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో అతని భాగస్వామ్యం అత్యంత కీలకం కానుందని అన్నాడు. అలాగే, ఈసారి టీమ్ ఇండియా టైటిల్ కొట్టడం ఖాయమని ధీమా వ్యక్తంచేశాడు.


Similar News