విశాఖ సముద్రంలో వడ్డే యల్లయ్య డెడ్ బాడీ? ఆమెతో కలిసే హత్యకు స్కెచ్ వేశారా..?

by Disha Web Desk |
విశాఖ సముద్రంలో వడ్డే యల్లయ్య డెడ్ బాడీ? ఆమెతో కలిసే హత్యకు స్కెచ్ వేశారా..?
X

దిశ, వెబ్‌డెస్క్ : మాజీ జనశక్తి నక్సలైట్, సూర్యాపేట బ్లాక్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వడ్డే యల్లయ్య మిస్సింగ్ కేసు విషాదంగా మారినట్టు తెలుస్తోంది. ఆయనను పది రోజులు క్రితం పక్కా పధకం ప్రకారం కిడ్నాప్ చేసి హత్య చేసినట్లు సమాచారం. సెటిల్ మెంట్ పేరుతో సూర్యాపేట నుంచి జగ్గయ్యపేటకు రప్పించి అక్కడే హత్య చేసి మృతదేహాన్ని వైజాగ్ సముద్రంలో పడేసినట్లు తెలిసింది. అటు ఏపీ, ఇటు తెలంగాణలో సంచలనం సృష్టిస్తోన్న ఈ మిస్సింగ్, హత్యకు సంబంధించిన వివరాలు అత్యంత విశ్వాసనీయ వర్గాలు వెల్లడించాయి.

లవర్స్ మధ్య పంచాయితీ చేయడానికి వెళ్లి..

హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ, కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన వ్యక్తి ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో సదరు మహిళ అతడికి రూ.20 లక్షలు ఇచ్చింది. డబ్బులు తీసుకున్న తర్వాత ప్రియుడు ముఖం చాటేయడంతో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇదే విషయం సూర్యాపేట మండలం యర్కారం గ్రామానికి చెందిన మాజీ నక్సలైట్, సూర్యాపేట బ్లాక్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వడ్డే యల్లయ్య వద్దకు వచ్చింది. అప్పటికే సెటిల్ మెంట్లు చేసే అలవాటు ఉన్న యల్లయ్య పంచాయితీని సెట్ చేస్తానని చెప్పాడు. దీంతో యలయ్యకు రూ.5 లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా ఏప్రిల్ 18న సదరు మహిళతో కలిసి యల్లయ్య సూర్యాపేటకు చెందిన ఓ వ్యాపారి కారు తీసుకోని జగ్గయ్యపేటకు వెళ్లాడు. ఆ తర్వాత కనిపించకుండా పోయాడు. దీంతో వడ్డే యల్లయ్య భార్య యల్లమ్మ సూర్యాపేట, జగ్గయ్యపేట పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసింది. నాటి నుంచి ఆయన ఆచూకీ కోసం ఏపీ, తెలంగాణ పోలీసులు సెర్చింగ్ చేస్తున్నారు.

అంతా పధకం ప్రకారమే చేశారా..?

యల్లయ్య మిస్సింగ్ వెనక పెద్ద పధకమే ఉన్నట్లు తెలుస్తోంది. ఎక్కడో హైదరాబాద్‌లో ఉండే మహిళ సూర్యాపేటలో ఉన్న యల్లయ్యను వెతుక్కుంటూ వచ్చి సెటిల్ మెంట్ చేయాలని కోరడం.. జగ్గయ్యపేటలో వ్యక్తి డబ్బులు ఇస్తా.. ఒక్కడివే రావాలి అని కోరడం వెనక పెద్ద స్కెచ్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. యల్లయ్యను హత్య చేయడానికే ఓ ఫేక్ పంచాయితీని క్రియేట్ చేసి ప్రత్యర్థులు ‘కథ’ నడిపించినట్లు భానుపురిలో గుప్పుమంటుంది. యల్లయ్య మిస్సింగ్ వెనక సూర్యాపేట జిల్లా తిరుమలగిరికి చెందిన ఓ స్వచ్ఛంధ సంస్థ నిర్వహకుడితో పాటు మరి కొంతమంది వ్యక్తులు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు సైతం వారిని అదుపులోకి తీసుకోని సీక్రెట్‌గా విచారిస్తున్నట్లు తెలిసింది. స్వచ్ఛంధ సంస్థ నిర్వహకుడితో వడ్డే యల్లయ్యకు పాత గొడవలు , ల్యాండ్ సెటిల్ మెంట్ విషయంలోనూ వివాదాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే హత్యకు ప్లాన్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

కారు అక్కడ.. యల్లయ్య ఎక్కడ..?

కాగా, ఈ నెల 18న జగ్గయ్యపేటకు కారులో బయలుదేరిన యల్లయ్య.. ఆ రోజు నుంచి కనిపించకుండాపోయాడు. అయితే యల్లయ్య వెళ్లిన కారు ఈ నెల 25న జగ్గయ్యపేట సమీపంలోని పెనుగంచిప్రోలు గ్రామ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో లభ్యమైంది. కానీ యల్లయ్య ఆచూకీ లభించలేదు. అయితే ఆయనను జగ్గయ్యపేటలోని ఓ లాడ్జీకి తీసుకెళ్లి అక్కడే హత్య చేశారని, ఆ తర్వాత ఫిష్షరీస్ లారీలో ఆయన బాడీని తీసుకెళ్లి విశాఖ పట్నం సముద్రంలో పడేశారని సూర్యాపేట వ్యాప్తంగా ప్రచారం జరుగుతోంది. ఈ ఘటనలో మహిళా ప్రియుడే ప్రధాన పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. తిరుమలగిరికి చెందిన వ్యక్తి ప్రొద్భలంతోనే అతడు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు సమాచారం.

ప్రస్తుతం ఈ ఇద్దరు వ్యక్తులతో పాటు ఆ మహిళ మరికొంతమంది వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకోని విచారిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే నాలుగు బృందాలుగా విడిపోయిన పోలీసులు విచారణను వేగవంతం చేశారు. మరోవైపు యల్లయ్య మృతదేహం కోసం సముద్రంలో గాలింపు చర్యలు చేపట్టారు. ఆయన డెడ్ బాడీ దొరికితేనే ఈ కేసు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఈ ఘటనపై పోలీసులు ఈ రోజు, లేదా రేపు పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.



Next Story

Most Viewed