ఆ వాటర్ ట్యాంకుకు 50 ఏళ్లు

by  |
ఆ వాటర్ ట్యాంకుకు 50 ఏళ్లు
X

దిశ, జగిత్యాల : దాదాపు యాభై ఏళ్ల నుండి దాహార్తిని తీర్చుతున్న జగిత్యాల వాటర్ ట్యాంకు నిర్మాణం నేటితో 50 ఏళ్ళు పూర్తి చేసుకుంది. పట్టణ ప్రజల అవసరాల దృష్ట్యా 20, 8, 1971న పట్టణ ప్రజల తాగునీటి అవసరాల కోసం కొత్త బస్ స్టాండ్‌కు సమీపంలో నిర్మాణం జరిగింది. నాటి నుండి నేటి వరకు ఈ వాటర్ ట్యాంకు జగిత్యాల పట్టణానికి జలప్రదాయినిగా విరాజిల్లుతుంది. అనాటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి దీని నిర్మాణానికి పునాది రాయి వేసి భూమి పూజ చేయగా కొద్దిరోజుల్లోనే నిర్మాణాన్ని పూర్తి చేశారని చెప్పుకుంటున్నారు. 1971లో ఏర్పడిన తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల పట్టణంలో తీవ్రమైన తాగునీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న సమయంలో నివారించేందుకు ఈ వాటర్ ట్యాంక్ ను నిర్మించారని స్థానికులు పేర్కొంటున్నారు. జగిత్యాల మున్సిపల్ పాలకుల విజ్ఞప్తి మేరకు అప్పటి సీఎం కాసు బ్రహ్మానంద రెడ్డి స్వయంగా జగిత్యాల పట్టణానికి వచ్చి పునాది రాయి వేసినట్లు చెబుతున్నారు. పట్టణంలో నివసిస్తున్న జనాభాకు అనుగుణంగా ఇంత పెద్ద భారీ వాటర్ ట్యాంకు అవసరం లేకున్నా భావి తరాలను దృష్టిలో పెట్టుకొని నిర్మించడం అప్పటి పాలకుల ముందుచూపుకు నిదర్శనంగా నిలుస్తుండగా ఈ వాటర్ ట్యాంకు నమూనా నిర్మాణం, క్వాలిటీ పర్యవేక్షణ ఆనాటి అనుభవజ్ఞులైన ఇంజనీర్ల ప్రతిభ నైపుణ్యానికి అద్దం పడుతోంది.

వాటర్ కెపాసిటీ….

మామూలుగా కాకుండా ఈ వాటర్ ట్యాంక్‌ను కింద, పైన నీటి నిలువ ఉండే విధంగా నిర్మించారు. కింద 727 కిలో లీటర్‌లు, పైన 7.86 కిలో లీటర్ నీరు నిలువ ఉండే విధంగా నిర్మించారు. మొత్తం వాటర్ ట్యాంక్ 15 లక్షల లీటర్ల కెపాసిటీతో ఈ వాటర్ ట్యాంకు నిర్మాణం జరిగిందని వాటర్ ఇంజనీర్ అధికారులు వెల్లడిస్తున్నారు.

నాణ్యంగా నిర్మించడంతో…

జగిత్యాల పట్టణంలో పలు చోట్ల రక్షిత మంచినీటి సరఫరా పథకం కింద నిర్మించిన వాటర్ ట్యాంక్ లు ఈ నిర్మాణాన్ని తలదన్న లేక పోతున్నాయి. 1971లో నిర్మించిన ఈ వాటర్ ట్యాంక్ 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న దాని కాలానుగుణంగా పగుళ్ళు వచ్చినప్పటికి కొత్త నిర్మాణాలు చేపట్టిన అనతికాలంలోనే లీకేజీలు, పగుళ్ళు వంటి కారణాలతో వాటర్ ట్యాంకులు నిరుపయోగంగా మారుతున్నాయి. దీని పక్కనే 6 ఏళ్ల క్రితం దాదాపు 2 కోట్లతో నిర్మించిన వాటర్ ట్యాంక్ ఏ కారణం చెతో నిరుపయోగంగా మారింది. పట్టుమని పక్షం రోజులు కూడా దాని ద్వారా నీటిని సరఫరా చేయలేదని తెలిసింది. ఇకపోతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకం కింద మరో వాటర్ ట్యాంకు వీటి పక్కనే నిర్మాణంలో ఉంది.

ధర్మ సముద్రం చెరువు వద్ద ఫిల్టర్ బెడ్

పట్టణ ప్రజల తాగునీటి అవసరాలకు సమస్య ఉత్పన్నం కాకుండా ఎస్సారెస్పీ ద్వారా నిరంతరం నీటి సరఫరా అయ్యే ధర్మ సముద్రం చెరువు వద్ద ఫిల్టర్ బెడ్‌లను నిర్మించారు. అక్కడి నుండి భారీ పైపులైన్ల ద్వారా ఈ వాటర్ ట్యాంకులకు నీటి సరఫరా జరుగుతుండేది. ఈ వాటర్ ట్యాంక్ ద్వారా పట్టణంలోని దాదాపు పైపు లైన్ ఉన్న అన్ని వార్డుల కుళాయిల ద్వారా రెండు పూటలా నీటిని సరఫరా చేసేది. ప్రస్తుతం ఉదయం, కొన్ని వార్డులకు, సాయంత్రం పూట కొన్ని వార్డులకు తాగు నీటిని సరఫరా చేస్తున్నారు. ఫిల్టర్ బెడ్‌లు తుప్పు పట్టిన కారణంగా ప్రస్తుతం వాటిని వినియోగించడం లేదు. జగిత్యాల జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలం రాజేశ్వర్ రావు పేట గ్రామంలో ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ పథకం కింద ఏర్పాటు చేసిన ఫిల్టర్ బెడ్ ద్వారానే జగిత్యాల వాటర్ ట్యాంకులకు తాగు నీరు సరఫరా అవుతుంది. దాని వల్ల ఇక్కడ ఫిల్టర్ బెడ్ వ్యవస్థ అవసరం లేదని తెలుస్తోంది. రాజేశ్వరరావు పేట నుండి సరఫరా అవుతున్న నీటినే జగిత్యాల ప్రజలకు తాగునీటిని సరఫరా జరుగుతుంది.

కాలనీల్లో పబ్లిక్ నల్లాలు…

వాటర్ ట్యాంక్ నిర్మాణం పూర్తి అయిన తర్వాత ఇంటి యజమానులకు కుళాయి కనెక్షన్లు ఇవ్వడంతోపాటు సామాన్య, మధ్య తరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఆయా కాలనీల ప్రధాన కూడళ్లలో మున్సిపల్ పబ్లిక్ నల్లాలు ఏర్పాటు చేసిందని చెబుతున్నారు. వాటి ద్వారా కూడా చాలామంది తమ ఇంటి, తాగునీటి అవసరాలను తీర్చుకునేదని చెబుతున్నారు.

తరగని మక్కువ

జగిత్యాల వాటర్ ట్యాంకు ద్వారా సరఫరా అవుతున్న మంచి నీటిని ఒకసారి తాగిన మళ్లీ మళ్లీ తాగాలనిపించే విధంగా ఉండేవని, ఏదైనా కారణం చేత నల్లా నీరు సరఫరా కావడం లేదంటే నీటి కోసం అల్లాడేవారని పేర్కొంటున్నారు. ప్రస్తుతం ప్రజలలో వచ్చిన ఆధునిక మార్పు వల్ల మినరల్ వాటర్‌కు అలవాటు పడడంతో కుళాయి నీటిపై వ్యామోహం తగ్గిందని తెలుస్తున్నా, ఇప్పటికీ చాలా మంది ఫిల్టర్ నీరు దాహార్తిని తీర్చడం లేదని, ఈ నీటితోనే దాహార్తి తీరుతుందని నమ్ముతూ చాలా మంది ఈ వాటర్ ట్యాంక్ నుండి సరఫరా అవుతున్న నీటికి ప్రాధాన్యత ఇస్తూ ట్యాంక్ వద్దకు వెళ్లి క్యాన్‌లలో నీటిని తీసుకెళ్తున్నారు.

జగిత్యాలలో అప్పుడు ఉన్న బస్టాండ్‌లో ఏర్పాటుచేసిన వాటర్ ట్యాంక్ నిర్మాణం జరిగి నేటికి 50 ఏండ్లు పూర్తయిందని, ఈ ట్యాంకు నిర్మాణం జరగక ముందు పట్టణంలో తాగు నీటికి చాలా కష్టంగా ఉండేదని మైళ్ళ దూరం నుండి తాగు నీటి కోసం టవర్ మార్కెట్‌లోకి, చింతకుంట చెరువు సమీపంలోని మంచినీళ్ళ బావి, ఇతర బావులకు వెళ్లి తాగు నీరు తెచ్చుకునేవారిమని అన్నారు. ఆనాడు జగిత్యాల చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కువగా మంచినీటి సమస్య ఉండేదని, ఇక్కడ ఉన్న మంచి నీటి సమస్యలు తెలుసుకొని 1971 లో అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి ట్యాంక్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. దీంతో ట్యాంక్ నిర్మాణం జరగడంతో జగిత్యాల ప్రజలకు తాగునీటి సమస్య తిరిందని అన్నారు. అడ్వాల రాజన్న (78) జగిత్యాల.



Next Story

Most Viewed