తుఫాన్ హెచ్చరిక.. రేడియో మాన్‌సూన్

by  |
తుఫాన్ హెచ్చరిక.. రేడియో మాన్‌సూన్
X

దిశ, ఫీచర్స్ : 2017లో ఇండియాను తాకిన ఓకి తుఫాన్.. కోస్టల్ తమిళనాడు, కేరళ, లక్ష్యద్వీప్‌‌ను సర్వనాశనం చేసింది. ఇందులో 365 మంది ప్రాణాలు కోల్పోగా.. వేలాది మంది అత్యంత దుర్భర పరిస్థితుల్లో చిక్కుకుపోయారు. ఈ సంఘటన స్థానికులతో పాటు చేపల వేటపై ఆధారపడి బతికే మత్స్యకారుల కుటుంబాలపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. వాతావరణ హెచ్చరికలు లేదా తుఫాను తీవ్రత గురించి తెలియకనే మత్స్యకారులు మరణించారు. 2018లో కేరళ వరద సమయంలోనూ ఇదే పునరావృతం కాగా వాతావరణ పరిస్థితులపై ఖచ్చితమైన సమాచారం తెలుసుంటే చాలా మంది ప్రాణాలు నిలిచేవనే విషయం అర్థమైంది.

అయితే ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్‌మెంట్(IMD) వాతావరణ సమాచారాన్ని అందించినా.. అందులోని ఇంగ్లీష్‌ లేదా టెక్నికల్ పదాల మూలాన మత్స్యకారులకు అర్థమయ్యేది కాదు. ఈ గ్యాప్‌ను ఫుల్‌ఫిల్ చేసేందుకు కేరళకు చెందిన కొంతమంది పరిశోధకుల బృందం, మీడియా ఎక్స్‌పర్ట్స్ టీమ్‌గా ఏర్పడి లోకల్‌గా ఓ రేడియో స్టేషన్ ఏర్పాటు చేశారు. అదే ‘రేడియో మాన్‌సూన్’‘మాక్సిమిలన్ మార్టిన్, అలోసియస్ గోమేజ్, సాజన్, సింధు మేరియా నెపోలియన్‌, కిషోర్ క్లెమెంట్’ అనే ఐదుగురు వ్యక్తులు కలిసి ‘రేడియో మాన్‌సూన్’ను ఏర్పాటు చేశారు. వీరు వాతావరణ అంచనా ఏజెన్సీల నుంచి వచ్చే టెక్నికల్ డేటాను విశ్లేషించి, స్థానిక ఫిషర్‌మెన్‌కు అర్థమయ్యే భాషలో సమయానుకూలంగా ఖచ్చితమైన సమాచారాన్ని అందజేస్తారు. ఈ మేరకు రాబోయే ప్రమాదాల గురించి ముందస్తుగా హెచ్చరించి ప్రాణనష్టాన్ని నివారిస్తున్నారు’.

సముద్ర మార్గాన్ని సురక్షితం చేసే దిశగా..

ఈ గ్రూప్ మెంబర్స్‌లో యూనివర్సిటీ ఆఫ్ ససెక్స్, యూకేలో పోస్ట్‌డాక్టోరల్ రీసెర్చ్ ఫెలో అయిన మాక్సిమిలన్ మార్టిన్ కూడా ఒకరు. ఫౌండర్ మెంబర్స్ అలోసియస్ గోమేజ్, సాజన్ దీనికి సలహాదారులుగా వ్యవహరిస్తుండగా.. సింధు, కిషోర్ క్లెమెంట్‌లు స్టేషన్ మేనేజర్లుగా సేవలందిస్తున్నారు. కారుంకులం అనే తీరప్రాంత గ్రామంలో ఈ రేడియో స్టేషన్‌ హెడ్‌క్వార్టర్‌ ఏర్పాటు చేశారు. ఇది ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషియన్ ఇన్‌ఫర్మేషన్ సర్వీసెస్(INCOIS), నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్‌కాస్టింగ్(NCMRWF), IMD, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(IIT)-మద్రాస్ అండ్ కేరళ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ(KDMA) వంటి వివిధ న్యూస్ ఏజెన్సీల నుంచి సమాచారాన్ని సేకరిస్తుంది. అంతేకాదు సందర్భానుసారంగా యూరోపియన్ సెంటర్ నుంచి కూడా ఇన్‌పుట్స్ తీసుకుంటుంది.

‘గతంలో భారత్‌లోని ఈశాన్య తీరప్రాంతాలపై తుఫాన్ల ప్రభావం ఎక్కువగా ఉండేది. కానీ వాతావరణ మార్పుల వల్ల కొన్నేళ్లుగా పశ్చిమతీరంగుండా తుఫాన్లు ఏర్పడుతున్నాయి. ఇలాంటి పరిస్థితులు ఫిషింగ్ కమ్యూనిటీకి హాని చేస్తుండగా.. ముందస్తు సమాచారం నేరుగా మత్స్యకారులకు అందించే ప్రభుత్వ ఏజెన్సీ లేకపోవడంతో ప్రాణనష్టానికి దారితీస్తోంది.

లోకల్ బాడీస్ హెల్ప్‌తో తీరప్రాంతాల్లో సేవలు..

2000 సంవత్సరంలోనే ఈ సమస్యకు పరిష్కారం చూపేలా మరొక కమ్యూనిటీ రేడియో కోసం ప్రయత్నించినా సక్సెస్ కాలేదు. ఏదేమైనా ‘రేడియో మాన్‌సూన్’ ట్రస్ట్ ఉనికిలోకి వచ్చిన 2014లో కొత్త ప్రయత్నం ప్రారంభమైంది. సభ్యులు, వాలంటీర్లు వాతావరణ సమాచారాన్ని ప్రసారం చేయడానికి లౌడ్ స్పీకర్లతో తీరప్రాంతానికి చేరుకుంటారు. ఇందుకోసం స్థానిక పోలీస్ స్టేషన్‌తో పాటు చర్చి సహాయం కూడా తీసుకుంటారు. కానీ దీని నిర్వహణకు కూడా నిధుల సమస్య ఉందని గ్రూప్ సభ్యుడు ఒకరు వెల్లడించారు. అయితే ఫిషర్‌మెన్‌కు ముందస్తు వాతావరణ సమాచారాన్ని చేరవేసే ఇంటర్ డిసిప్లినరీ ప్రోగ్రామ్‌పై పనిచేస్తున్న యూనివర్సిటీ ఆఫ్ ససెక్స్.. 2018లో వీరికి అవసరమైన కొన్ని వనరులను సమకూర్చినట్టు తెలిపారు. స్వతహాగా మత్స్యకారుడి కూతురైన స్టేషన్ మేనేజర్ సింధు.. అదే సంవత్సరంలో టీమ్‌లో జాయిన్ కాగా, తుఫాన్ పరిస్థితుల్లో తీరానికి దూరంగా ఉన్న వారికి సమాచారాన్ని చేరవేస్తూ ఇప్పటివరకు వెయ్యి మందిని కాపాడినట్టు చెప్పింది.

చదువురాని వారికి అర్థమయ్యే భాషలో..

మేము అన్ని ఏజెన్సీల నుంచి డేటా సేకరించి, సాంకేతిక పదాలను అర్థంచేసుకుని విశ్లేషిస్తాం. ఆ తర్వాత మత్స్యకారులకు శాస్త్రీయ సమాచారాన్ని విచ్ఛిన్నం చేస్తాం. ఉదాహరణకు.. విస్తృత భౌగోళిక ప్రాంతమైన అరేబియా సముద్రంలో తుఫాన్ కదలికలపై వాతావరణ హెచ్చరిక ప్రకటించబడింది. కానీ స్థానికంగా ఎలాంటి ప్రభావం తెలియదు. మేము అటువంటి సాంకేతికతల అర్థాన్ని గుర్తించి, కింది స్థాయి సమాజానికి కూడా సులభంగా అర్థమయ్యేలా ప్రజెంట్ చేస్తాం. పైగా ప్రభుత్వ వాతావరణ అంచనా ఏజెన్సీలు ప్రసారం చేసిన సమాచారం ప్రధానంగా భూభాగాలకు సంబంధించే తప్ప, సముద్రంపై దాని ప్రభావం ఏంటన్న విషయంలో స్పష్టత తక్కువ. మేము ఆ సమాచారాన్ని విశ్లేషించి, సముద్రంలోని మత్స్యకారులకు మార్గనిర్దేశం చేస్తాం. ఇది వారి మార్గాన్ని లేదా ప్రణాళికలను మార్చేందుకు సాయపడుతుంది.

– సింధు, రేడియో స్టేషన్ మేనేజర్

సముద్రంలో 70 కిలోమీటర్ల వరకు..

వాతావరణ సమాచారం మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యే టైమ్‌లో మ. 1 నుంచి 2 గంటల మధ్య షేర్ అవుతుంది. రేడియోలో ప్రసారం చేయడంతో పాటు ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా సైట్స్‌లోనూ ఇన్‌ఫర్మేషన్‌ను పోస్ట్ చేస్తారు. అంతేకాదు ఫిషర్‌మెన్ కూడా 365 రోజుల్లో ఎప్పుడైనా రేడియో స్టేషన్‌కు కాల్ చేసి ‘పర్టిక్యులర్ డే’కు సంబంధించిన వెదర్ కండిషన్స్ గురించి తెలుసుకోవచ్చు. ఇందుకోసం మిస్డ్ కాల్ ఇచ్చినా సరిపోతుంది. లేదంటే కేటాయించిన ఫోన్ నెంబర్‌కు డయల్ చేసినా ప్రీ-రికార్డెడ్ మెసేజ్‌ ప్లే అవుతుంది. చదువుకోని వాళ్లకు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకునేలా సిస్టమ్ రూపొందించారు. కాగా యంగ్ జనరేషన్‌ ఫిషర్‌మెన్ మాత్రం సోషల్ మీడియాను ఫాలో అవుతారు. ఈ రేడియో రేంజ్ భూమి మీద అయితే 10-12 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అయితే సముద్రంలో కొన్ని అంతరాయాలు, డిస్ట్రబెన్స్ ఉన్పప్పటికీ సిగ్నల్స్ 70 కిలోమీటర్ల వరకు రీచ్ అవుతాయి.

మత్స్యకారులే.. సెకండరీ డేటా సోర్సెస్

రేడియో మాన్‌సూన్ కూడా మత్స్యకారుల నుంచి ఇన్‌పుట్స్ తీసుకుంటుంది. వారు సముద్రంలో ఉన్నప్పుడు జరిగే వాతావరణ మార్పులకు మొదటి సాక్ష్యులు వారే. అంతేకాదు వారంతా స్వదేశీయులే కాక, సముద్రం గురించి తెలిసినవారు. అందుకే ఫిషర్‌మెన్ ఇచ్చిన సమాచారం క్రాస్ చెక్ చేసుకునేందుకు సెకండరీ డేటాగా పనిచేస్తుంది లేదంటే టెక్నాలజీకి చిక్కని విలువైన విషయాలను తేల్చేందుకు సాయపడుతుంది. ఫిషింగ్ కమ్యూనిటీకి తమ ప్రాంతీయ భాష మలయాళంలోనే సైంటిఫిక్ సమాచారాన్ని తెలుసుకునే అవకాశాన్ని కల్పించిందని అల్ఫోన్స్ అనే మత్స్యకారుడు వెల్లడించాడు. గాలి వీచే దిశను బట్టి సముద్రంలో ఎలాంటి పరిస్థితులు తలెత్తనున్నాయనే విషయం తమకు అర్థమవుతుందని తెలిపాడు.

ఇక కమ్యూనిటీ రేడియోను నిర్వహించడానికి భారీ వనరులతో పాటు శాస్త్రీయ డేటాను అర్థం చేసుకుని శ్రోతల ప్రయోజనాలకు అనుగుణంగా అందించగల ఇంటెలిజెంట్ స్టాఫ్ కూడా అవసరం. అయితే ప్రస్తుతానికి రెవెన్యూ మోడల్ స్ట్రీమ్‌లైన్స్ ఏర్పడే వరకు తమ దృష్టంతా కఠినమైన వాతావరణ పరిస్థితులను గుర్తించి, సమయానుకూలంగా ఖచ్చితమైన సమాచారాన్ని అందించడం ద్వారా ప్రాణనష్టం తగ్గించడం మీదనే అని ‘రేడియో మాన్‌సూన్’ టీమ్ సభ్యులు వెల్లడించారు.

Next Story

Most Viewed