బీజేపీ కోసం సికింద్రాబాద్‌ను తాకట్టు పెట్టిండ్రు: సీఎం రేవంత్‌రెడ్డి ఫైర్

by Disha Web Desk 1 |
బీజేపీ కోసం సికింద్రాబాద్‌ను తాకట్టు పెట్టిండ్రు: సీఎం రేవంత్‌రెడ్డి ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ కోసం బీఆర్ఎస్ సికింద్రాబాద్ సీటును తాకట్టు పెట్టిందని సీఎం రేవంత్‌రెడ్డి ఫైర్ అయ్యారు.బుధవారం ఆయన సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్ధి దానం నాగేందర్ నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. గతంలో దత్తాత్రేయ‌ను అంజన్‌ కుమార్‌ యాదవ్ ఓడించినట్లే, ఇప్పుడు సికింద్రాబాద్‌లో మూడు రంగుల కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని అన్నారు. సికింద్రాబాద్‌లో గెలిచిన పార్టీనే కేంద్రంలో పవర్‌లోకి వస్తుందని, అందుకే కాంగ్రెస్‌ను గెలిపించాల్సిందిగా కోరారు. దానం గెలిస్తే కేంద్రంలో కీ రోల్ పోషిస్తాడని తెలిపారు.

గతంలో సోనియమ్మ నాయకత్వంలో కాంగ్రెస్ పవర్‌లోకి వచ్చిందని, 20 ఏళ్ల తర్వాత ఆ రోజులను పునరావృతం చేసేందుకు దానం నాగేందర్‌ను గెలిపించాలని అన్నారు. మహంకాళి అమ్మ ఆశీస్సులతో సికింద్రాబాద్‌లో కాంగ్రెస్ గెలిచి, సెంట్రల్‌లో పవర్‌లోకి వస్తుందని తెలిపారు. బీజేపీ నాయకులు పదేళ్ల పాటు కేంద్ర మంత్రులైనా, హైదరాబాద్‌కు చేసింది ఏమిటీ? అంటూ ఫైర్ అయ్యారు. వరదలు వచ్చి హైదరాబాద్ అతలాకుతలమైతే, కేంద్రమంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి నగరానికి చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదని ఆరోపించారు. జంట నగరాల్లో మెట్రో రైలు రావడానికి కారణం కాంగ్రెస్ అని గుర్తు చేశారు. పద్మారావు పరువు తీసేందుకే కేసీఆర్ ఆయనను పోటీకి దింపారని, ఆయన నామినేషన్‌కు కేసీఆర్, కేటీఆర్ ఎందుకు రాలేదని ప్రశ్నించారు.

బస్తీల్లో ప్రజల కష్టాలు తీరాలంటే సికింద్రాబాద్ ఎంపీగా దానం నాగేందర్‌ను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఇది ఇందిరమ్మ ప్రభుత్వమని, అన్ని వర్గాలకు మేలు చేసేలా నిర్ణయాలు ఉంటాయని అన్నారు. నగరానికి కృష్ణా, గోదావరి జలాలు తెచ్చింది ఎవరో చర్చ పెడదామా? అంటూ సీఎం సవాల్ విసిరారు. బీఆర్ఎస్‌కు ఓటు వేస్తే మూసీలో వేసినట్లేనని సీఎం క్లారిటీ ఇచ్చారు. అనిల్‌కుమార్ యాదవ్, దానం జోడెద్దుల్లా తనకు అండగా ఉంటారని సీఎం వ్యాఖ్యానించారు. దేవుడు గుడిలో, భక్తి గుండెల్లో ఉండాలని, కానీ బీజేపీ దాన్ని అన్ని వ్యవస్థలకు, కార్యక్రమాలకు వాడుకుంటున్నదని ఫైర్ అయ్యారు.



Next Story

Most Viewed