జిల్లా కాంగ్రెస్ లో అనూహ్య పరిణామాలు…ఆ ముగ్గురి నేతల చేరిక నిలిపివేత

by Disha Web Desk 11 |
జిల్లా కాంగ్రెస్ లో అనూహ్య పరిణామాలు…ఆ ముగ్గురి నేతల చేరిక నిలిపివేత
X

దిశ,ఆదిలాబాద్ : పార్ల‌మెంట్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో అనూహ్య ప‌రిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఆరేళ్ల‌పాటు బ‌హిష్క‌ర‌ణ‌కు గురైన నేతల పై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేయడంతో... మూడు రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారి జాయినింగ్స్‌ను రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్సీ ఆదేశాలతో నిలిపివేస్తున్న‌ట్టు టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, చేరిక‌ల క‌మిటీ మెంబ‌ర్ తూర్పు జ‌గ్గారెడ్డి శుక్రవారం మీడియాకు ఒక ప్ర‌క‌ట‌న జారీ చేశారు.

ఇటీవ‌ల ఆ ముగ్గురు బ‌హిష్కృత నేత‌లు సాజిద్‌ఖాన్‌, సుజాత‌, సంజీవ్‌రెడ్డి లు పార్టీలో చేరిన క్ర‌మంలో ఆదిలాబాద్ కాంగ్రెస్ శ్రేణుల్లో ఆందోళ‌న త‌లెత్తింది. ఈ నేప‌థ్యంలోనే అధిష్టాన పెద్ద‌లు ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టుగా తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పార్టీకి వ్య‌తిరేకంగా వ్య‌వ‌హ‌రించి పార్టీ నుండి స‌స్పెండ్‌కు గురైన అస‌మ్మ‌తివాదులను తిరిగి పార్టీలో చేర్చుకోవ‌డం త‌గ‌ద‌ని, వెంట‌నే వారిని బ‌హిష్క‌రించాల‌ని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కంది శ్రీ‌నివాస‌రెడ్డి మ‌ద్ద‌తుదారులు ఆందోళ‌న చేప‌ట్టారు. ఇటీవ‌ల జిల్లా కేంద్రంలోని ఆర్ఎస్ గార్డెన్ స‌మీపంలో న‌ల్ల‌గుడ్డాలు క‌ట్టుకుని పెద్ద ఎత్తున నిర‌స‌న వ్య‌క్తం చేశారు. దీంతో స్పందించిన హైక‌మాండ్ వారి చేరిక‌ను నిలిపివేస్తున్న‌ట్టుగా వెల్ల‌డించింది.

Next Story

Most Viewed