నాలుగేళ్ల డిగ్రీతో ఇకపై నేరుగా పీహెచ్‌డీ : యూజీసీ

by Dishanational4 |
నాలుగేళ్ల డిగ్రీతో ఇకపై నేరుగా పీహెచ్‌డీ : యూజీసీ
X

దిశ, నేషనల్ బ్యూరో : పీహెచ్‌డీ ప్రవేశాలకు సంబంధించి యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) కీలక నిర్ణయం ప్రకటించింది. నాలుగేళ్ల అండర్‌ గ్రాడ్యుయేట్‌ డిగ్రీ ఉన్న విద్యార్థులు ఇకపై నేరుగా యూజీసీ నెట్‌ పరీక్ష రాయొచ్చని, తద్వారా వారు పీహెచ్‌డీ చేయొచ్చని వెల్లడించింది. ఈ అభ్యర్థులు డిగ్రీలో సబ్జెక్టులతో సంబంధం లేకుండా తాము ఎంచుకున్న అంశాల్లో పీహెచ్‌డీ చేయొచ్చని తెలిపింది. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF) ఉన్నా లేకపోయినా.. పీహెచ్‌డీ చేసేందుకు నాలుగేళ్ల డిగ్రీలో కనీసం 75 శాతం మార్కులు లేదా తత్సమాన గ్రేడ్‌ ఉంటే చాలని యూజీసీ ఛైర్మన్‌ జగదీశ్‌ కుమార్‌ స్పష్టం చేశారు. ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ (నాన్‌ క్రిమీ లేయర్‌), దివ్యాంగులు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు, ఇతర వర్గాలకు చెందిన వారికి 5శాతం మార్కులు/గ్రేడ్‌లలో సడలింపు ఉంటుందన్నారు. యూజీసీ నెట్‌ (జూన్‌) సెషన్‌ పరీక్షలో ఈ కొత్త విధానాన్ని అమలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతం నాలుగేళ్ల డిగ్రీ కోర్సు ఎనిమిదో సెమిస్టర్‌లో ఉన్న విద్యార్థులు సైతం యూజీసీ నెట్‌‌కు అప్లై చేసుకోవచ్చని సూచించారు. దీనికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ శనివారం నుంచే ప్రారంభమైంది. కాగా, ఇప్పటివరకు మాస్టర్స్‌ డిగ్రీ పూర్తి చేసి 55శాతం మార్కులున్న వారిని మాత్రమే నెట్‌కు అర్హులుగా పరిగణించేవారు.



Next Story

Most Viewed