పారదర్శక ఇండో పసిఫిక్ రిజియన్ నిర్మాణమే లక్ష్యం: జైశంకర్

by Dishanational4 |
పారదర్శక ఇండో పసిఫిక్ రిజియన్ నిర్మాణమే లక్ష్యం: జైశంకర్
X

బ్యాంకాక్: అంతర్జాతీయ వ్యవస్థ నిబంధనలకు లోబడి పారదర్శకమైన, శాంతియుతమైన, సంపద్వంతమైన ఇండో పసిఫిక్ రీజియన్ నిర్మాణానికి భారత్ కట్టుబడి ఉందని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు. ఇండో పసిఫిక్ వ్యూహాత్మక ప్రాంతంలో చైనా తన భుజబలాన్ని ప్రదర్శిస్తున్న నేపథ్యంలో భారత్ వైఖరిని ఆయన స్పష్టం చేశారు. థాయ్‌లాండ్ లోని చులలోంగ్‌కోర్న్ యూనివర్శిటీలో గురువారం ఇండియాస్ విజన్ ఆఫ్ ది ఇండో పసిఫిక్ అనే అంశంపై జైశంకర్ ప్రసంగించారు.

ఇండో పసిఫిక్ రీజియన్‌లో సమకాలీన సవాళ్లను ఎదుర్కోవడానికి, అవకాశాలను కనుగొనడానికి అమరికా, భారత్, జపాన్, ఆస్ట్రేలియా నాలుగు దేశాలతో కూడిన క్వాడ్ కూటమి ఒక ముఖ్య బహుళ వేదికగా పనిచేస్తోందని జైశంకర్ పునరుద్ఘాటించారు. సార్వభామాధికారాన్ని పరిస్పరం గౌరవించుకోవడం, స్వేచ్ఛా విమాన, నౌకా ప్రయాణం, న్యాయబద్ధమైన వాణిజ్య విధానాల అమలు, వివాదాల పట్ల శాంతియుత పరిష్కారం, దేశాల మధ్య సమానతా ప్రాతిపదిక వంటివే ఇండో పసిఫిక్ రీజియన్‌లో సుస్థిరతను నెలకొల్పుతాయని ఆశాభావ్యం వ్యక్తపరిచారు.

చైనాపై జైశంకర్ నర్మగర్భ వ్యాఖ్యలు

అమెరికా నేతృత్వంలోని క్వాడ్ కూటమిని చైనా పదే పదే వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో జైశంకర్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. చైనా పరిసరాలను మార్చే లక్ష్యంతోనే క్వాడ్ కూటమి వ్యవహరిస్తోందని చైనా ఆరోపిస్తోంది. చైనాను నిరోధించి ఆసియా పసిఫిక్ దేశాలను అమెరికా ఆదిపత్యం కింది పావులుగా మార్చడానికే క్వాడ్ కూటమిని తీసుకొచ్చారని చైనా చేస్తున్న ఆరోపణలను జైశంకర్ పరోక్షంగా తోసిపుచ్చారు.

ప్రపంచ జనాభాలో 64 శాతానికి, ప్రపంచ జీడిపీలో 60 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇండో పసిపిక్ ప్రాంతాన్ని స్వేచ్ఛా ప్రాతంగా చేసినట్లయితే అది క్వాడ్ కూటమికే కాకుండా యావత్ ప్రపంచానికి మేలు చేకూరుస్తుందని జైశంకర్ పేర్కొన్నారు. సామూహికమైన, సహకారాత్మకమైన లక్ష్య సాధనను ఏకపక్షంగా వ్యతిరేకించాలని భావిస్తున్న వారే క్వాడ్ పట్ల రిజర్వేషన్లను వ్యక్తపరుస్తున్నారని జైశంకర్ చైనాను ఉద్దేశించి నర్బగర్భంగా వ్యాఖ్యానించారు.


Next Story

Most Viewed