‘అలాయ్ బలాయ్’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెంకయ్య

by  |
Vice President Venkaiah Naidu
X

దిశ, తెలంగాణ బ్యూరో: దసరా పండుగ సందర్భంగా ప్రతీ సంవత్సరం హైదరాబాద్‌లో జరిగే ‘అలాయ్ బలాయ్’ కార్యక్రమానికి ఈ సారి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ నెల 17వ తేదీన నగరంలోని జలవిహార్‌లో జరుగనుంది. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె బండారు విజయలక్ష్మి ఛైర్‌పర్సన్‌గా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అన్ని పార్టీల నేతలను ఆమె స్వయంగా కలిసి ఆహ్వాన పత్రికలను అందజేశారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లకు కూడా ఆహ్వానాన్ని అందించారు. వారు వస్తారనే ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్, గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రులు భూపేంద్రయాదవ్, కిషన్‌రెడ్డి తదితరులు కూడా హాజరుకానున్నారు.

బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ గవర్నర్‌గా నియమితులు కాకముందు ప్రతీ సంవత్సరం ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వహించడం ఒక సంప్రదాయంగానే కొనసాగింది. తెలంగాణ సంస్కృతిలో ఈ ఘట్టానికి ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని క్రమం తప్పకుండా నిర్వహించారు. ఈసారి మాత్రం ఆయన కుమార్తె నిర్వహిస్తున్నారు. కరోనా కారణంగా గతేడాది జరపలేకపోయినా ఈసారి పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని కొవిడ్ సేవలు అందించినవారిని వేదికపై ప్రత్యేకంగా సత్కరించనున్నట్లు తెలిపారు.


Next Story

Most Viewed