- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
భద్రాద్రి రామా మన్నించు.. అన్నప్రసాదశాలలో వర్ధంతి భోజనం

దిశ, భద్రాచలం : రామయ్య తండ్రీ క్షమించు. మా అపచారాన్ని మన్నించు అని భద్రాద్రి శ్రీరామ భక్తులు వేడుకొంటున్నారు. భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి వారి నిత్య అన్నదాన సత్రంలో మంగళవారం జరిగిన అన్నప్రసాద కార్యక్రమంపై భక్తుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. స్థానికులతోపాటు సుదూర ప్రాంతాల నుంచి భద్రాద్రి రామయ్య దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా అన్నప్రసాదం కళ్లకు అద్దుకొని స్వీకరించి ఎంతో తృప్తి చెందుతారు. భద్రాచల దేవస్థానం ఆధ్వర్యంలో భక్తుల కోసం నిరాటంకంగా కొనసాగించే ఈ అన్నప్రసాద కార్యక్రమానికి భక్తిభావంతో అనేకమంది ముందుకొచ్చి భారీగా విరాళాలు అందజేస్తారు. ఇక్కడ జరిగే అన్నదానం స్వామి వారి ప్రసాదంగానే భావిస్తారు.
అయితే మంగళవారం జరిగిన అన్నదానం విమర్శలకు దారి తీసింది. ఓ వ్యక్తి (మాజీ అధికారి) 50వ వర్థంతి సందర్భంగా 300 మంది భక్తులకు అన్నదానం నిమిత్తం సదరు వ్యక్తి బంధువులు విరాళం ఇచ్చారు. అయితే అన్నదానసత్రం ముందు వర్ధంతి బ్యానర్ పెట్టి నిర్వహించడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తులు తిన్నది రామయ్య అన్న ప్రసాదమా లేక వర్ధంతి భోజనమా అని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి వాటిని ఆలయ అధికారులు ఎలా అనుమతిస్తారని భక్తులు ఆగ్రహిస్తున్నారు. ఇంతటి అపచారానికి సహకరించిన ఆలయ అధికారులపై చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఈవో అందుబాటులోకి రాలేదు.