కత్తులెక్కడా..? పోలీసుల్లో టెన్షన్

by  |
కత్తులెక్కడా..? పోలీసుల్లో టెన్షన్
X

దిశ ప్రతినిది, కరీంనగర్: అడ్వకేట్ కపుల్స్ వామన్ రావు, నాగమణిల మర్డర్‌కు ఉపయోగించిన కత్తుల కోసం పోలీసుల వేట మొదలైంది. ఆదివారం సీ డైవర్స్ కొంతసేపు సెర్చ్ చేశారు. నిందితులు కుంట శ్రీనివాస్, చిరంజీవీలు చెప్పిన ప్రాంతాల్లో రెండు గేట్ల బ్యాక్ వాటర్‌లో సీ డైవర్స్ గాలించారు. సోమవారం డైవర్స్ అన్ని గేట్ల వద్ద బ్యాక్ వాటర్‌లో సెర్చ్ చేయాలని నిర్ణయించారు.

లోన బురద

సుందిళ్ల బ్యారేజ్‌లో 4 టీఎంసీల నీరు నిలువ ఉంది. కాళేశ్వరం జలాలను తరలించిన అధికారులు సుందిళ్లలో నిలువ ఉంచారు. అయితే ఎగువ ప్రాంతాలకు తరలించాల్సిన ఈ నీటిని భవిష్యత్తు అవసరాల కోసం స్టోర్ చేశారు. దీంతో బ్యారేజ్‌లో 10 మీటర్ల లోతున నీరు నిలిచి ఉంది. ఆదివారం సీడైవర్స్ బ్యారేజ్ నీటి గర్భంలోకి వెళ్లినప్పుడు బురద ఉందని చెప్పారు. దీంతో కత్తులను వెతకడం ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇనుముతో చేసిన వేట కొడవళ్లు బరువు ఎక్కువగా ఉంటాయి. దీంతో అవి బురదలో కూరుకుపోయే అవకాశాలు కూడా లేకపోలేదు. గేట్ల వద్ద బ్యాక్ వాటర్‌లో కొంత మేర కాంక్రీట్ వేస్తారు. ఆ ప్రాంతంలో కత్తులు పడితే గాలింపు చేయడానికి కొంత ఇబ్బంది ఎదురైనా ఖచ్చితంగా దొరికుతాయని అంచనా వేస్తున్నారు. ఒక వేళ కాంక్రీట్‌కు అవతల పడితే మాత్రం ఒండ్రులో కత్తులు దిగబడి ఉంటాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

అలా అయితే ఎలా..?

నీటి ప్రవాహం లేకపోవడంతో సుందిళ్ల బ్యారేజ్ బ్యాక్ వాటర్‌లో ఒండ్రు మట్టిగా మారినా.. మట్టిలోపల ప్రాంతానికి సీ డైవర్స్ వెళ్లే అవకాశం ఉండదు. కత్తులను వెలికితీసేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవల్సి వస్తుంది. పోలవరం వద్ద బోటు కూరుకుపోయినప్పుడు ధర్మాడి సత్యం చేపట్టినట్టుగా సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహిస్తే సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. భారీ సైజ్ మాగ్నైట్ (అయస్కాంతం)లకు గొలుసులు కట్టి బురద బ్యాక్ వాటర్‌లో గాలింపు చేపడితే సానుకూల ఫలితాలు వస్తాయా లేదా అన్న విషయంపై కూడా దృష్టి సారించాల్సి ఉంది.



Next Story

Most Viewed