- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఈ విషయం హరీశ్రావుకు తెలిస్తే.. వీళ్లకు ప్రమోషన్లు ఖాయం!

దిశ, అశ్వారావుపేట టౌన్: ప్రభుత్వ వైద్య సేవలు అందని ద్రాక్షగా మారాయనే అపవాదును చేరిపి వేసేలా కొందరు వైద్య సిబ్బంది కృతనిశ్చయంతో ఉన్నత సేవలందిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో మారుమూల అటవీ ప్రాంతంలోని పెద్దమిద్ది గ్రామంలో ఉదయం ఏడు గంటలకు వినాయకపురం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది ప్రత్యక్షమయ్యారు. బాహ్య ప్రపంచానికి దూరంగా ఉండే పెద్దమిద్ది చేరుకోవాలంటే అంతా ఆషామాషీ కాదు. మండలంలోని మొద్దులమడ గ్రామం నుంచి ఏడు కిలోమీటర్లు ప్రయాణించాలి. ఇందులో నాలుగు కిలోమీటర్లు ద్విచక్రవాహనాలపై ప్రయాణించిన తర్వాత మిగిలిన మూడు కిలోమీటర్లు వాహనాలు వెళ్లే అవకాశం లేకపోవడంతో నడుచుకుంటూ వెళ్లాల్సిందే
అటువంటి దట్టమైన అటవీ మార్గంలో వాగులు, వంకలు దాటి, రాళ్లు రప్పలు ఉండే నడక దారిలో మందులు, వైద్య పరికరాలు మోసుకుంటూ వైద్య సిబ్బంది ఎందుకు వెళ్లారంటే.. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు కావలసిన కోవిడ్ టీకాను ఆదివాసీలకు వేసేందుకు వినాయపురం పీహెచ్ సీ వైద్యుడు రాంబాబు, సబ్ యూనిట్ అధికారి అజ్మీర వెంకటేశ్వరరావు, హెచ్ఈవో రాజు ఆధ్వర్యంలో అక్కడికి వెళ్లారు. రోజువారీ పనులకు సిద్ధమైన గిరిజనులను ఒప్పించి 18 సంవత్సరాలు దాటిన 34 మందికి కోవిడ్ టీకాలను వేశారు. అనంతరం గ్రామంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి సాధారణ అనారోగ్యంతో ఉన్న 25 మందికి చికిత్స అందించారు. వృత్తి పట్ల నిబద్ధతతో ఆదివాసీల తలుపు తట్టి మరీ వైద్య సహాయాన్ని అందించిన వైద్య బృందాన్ని ఎంతైనా అభినందించాలి. ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ సత్యనారాయణ, ఏఎన్ఎంలు బూబి నాంచారి, చెల్లమ్మ, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
- Tags
- Aswarapeta