కాంగ్రెస్, బీజేపీ అధ్యక్ష పదవులు కేసీఆర్ భిక్ష: గంప గోవర్దన్

by  |
కాంగ్రెస్, బీజేపీ అధ్యక్ష పదవులు కేసీఆర్ భిక్ష: గంప గోవర్దన్
X

దిశ, కామారెడ్డి: కాంగ్రెస్, బీజేపీ అధ్యక్ష పదవులు కేసీఆర్ పెట్టిన భిక్ష అంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే గంప గోవర్దన్ అన్నారు. కేసీఆర్ దయాదాక్షిణ్యాలు లేకపోతే వారికి పదవులు వచ్చేవా అని ప్రశ్నించారు. గురువారం కామారెడ్డి మున్సిపాలిటీ పరిధి లింగాపూర్ బృందావన్ గార్డెన్‌లో నియోజకవర్గ స్థాయి టీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ గంప గోవర్దన్, నిజామాబాద్ జడ్పీ చైర్మన్ దాదన్న గారి విఠల్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కామారెడ్డి నియోజకవర్గంలోని గ్రామ కమిటీల వివరాలను జిల్లా ఇన్‌చార్జీకి అందజేశారు.

అనంతరం ప్రభుత్వ విప్ గంప గోవర్దన్ మాట్లాడుతూ.. నేటి రాజకీయలను దృష్టిలో ఉంచుకుని చూస్తే క్రమశిక్షణ కలిగిన పార్టీ టీఆర్ఎస్ అన్నారు. కాంగ్రెస్, బీజేపీ అధ్యక్ష హోదాలో ఉన్న నాయకుల మాటలకు టీఆర్ఎస్ నాయకులంతా ఓపిక, సహనంతో ఉన్నారని.. అందుకే స్పందించడం లేదని స్పష్టం చెప్పారు. వారి పిచ్చి మాటలకు టీఆర్ఎస్ నాయకులు భయపడరని చురకలు వేశారు. కరీంనగర్‌లో రెప్పపాటు విజయంతో ఎంపీగా గెలిచిన బండి సంజయ్ హిందూ రాజ్యాన్ని స్థాపిస్తామంటున్నారని, మేము హిందువులం కాదా.. పూజలు చేయడం లేదా అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. బండి సంజయ్ మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారన్నారు. ప్రధాని మోడీ స్వయంగా టీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలను మెచ్చుకుంటున్నారని, ఈ మాటలు గుర్తు తెచ్చుకుని మాట్లాడాలని బండి సంజయ్‌కి సూచించారు. బీజేపీ నాయకులు పిచ్చి ప్రేలాపణలు మాట్లాడటం మానుకోండని గంప గోవర్దన్ హెచ్చరించారు.


Next Story

Most Viewed