ఆ నేతలకు ఓటమే కలిసి వచ్చిందా..?

by  |
Revanth Kishanreddy Bandi sanjay
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఆ నేతలు శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు… పార్లమెంట్ ఎన్నికల్లో బరిలో నిలిచి ఘన విజయం సాధించి ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో కీ రోల్‌గా మారారు. పార్టీ బలోపేతంతో పాటు 2023 ఎన్నికల్లో తమ ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలు. వీరితో పాటు మరికొందరు ఎంపీగా విజయం సాధించి పార్టీల్లో కీలకంగా మారారు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. టీఆర్ఎస్ పార్టీ అత్యధిక సీట్లు సాధించి సీఎం కేసీఆర్ సారథ్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఐదేళ్ల కాలపరిమితి దాటడానికి తొమ్మిది నెలల ముందు (2018 సెప్టెంబరు 6) న అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. డిసెంబర్ 7న ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన సీనియర్ నాయకులు కుందూరు జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, అనుముల రేవంత్ రెడ్డితో పాటు బీజేపీ నుంచి పోటీ చేసిన కిషన్ రెడ్డి, బండి సంజయ్ లతో పాటు చాలా మంది నేతలు ఓటమిపాలయ్యారు. అయితే ఈ ఎన్నికల్లో ఓటమి చెందిన పలువురు నేతలకు పార్లమెంట్ ఎన్నికలు కలిసొచ్చాయి. అందులో ముఖ్యంగా కిషన్ రెడ్డి, బండి సంజయ్, రేవంత్ రెడ్డిలు ముందున్నారు.

బీజేపీ నేత కిషన్ రెడ్డి 2004, 2009, 2014లో వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే 2018లో అనూహ్యంగా ఓటమిపాలయ్యారు. ఈ ఓటమి తర్వాత 2019 ఏప్రిల్11న జరిగిన లోక్ సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత మోదీ కేబినెట్‌లో హోంశాఖ సహాయ మంత్రిగా చోటు దక్కించుకొని ప్రస్తుతం కేబినెట్ మంత్రి స్థాయికి ఎదిగారు. కిషన్ రెడ్డి 2018 లో ఎమ్మెల్యేగా గెలిస్తే ఈ స్థాయికి చేరుకునే వారేకాదు.

మరో నేత బండి సంజయ్ కుమార్ 2018లో కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం 2019 లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మళ్లీ కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ నుంచి పోటీ చేశారు. టీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ వినోద్ కుమార్ పై ఘనవిజయం సాధించారు. తొలిసారిగా పార్లమెంట్‌లో అడుగు పెట్టారు. ఎంపీగా ఎన్నికైన కొద్ది నెలల్లోనే జాతీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా నియమించింది. రాష్ట్ర పగ్గాలు చేపట్టి దుబ్బాక ఉప ఎన్నికల్లో పార్టీ విజయం సాధించడంలోనూ కీలక భూమిక పోషించారు. అదే విధంగా జీహెచ్ఎసీ ఎన్నికల్లోనూ గతంలో 4 సీట్లు ఉన్న బీజేపీ 48 స్థానాల్లో విజయం సాధించింది. తర్వాత జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో, నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో ఓటమి చెందినప్పటికీ తిరిగి త్వరలోనే జరుగబోయే హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా బండి ముందుకు సాగుతున్నారు. అందుకు తగిన ప్రణాళికలు రూపొందించి ప్రచారాన్ని విస్తృతం చేశారు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత టీడీపీకి ప్రాధాన్యత తగ్గతుందని భావించిన పార్టీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి పార్టీని వీడారు. కాంగ్రెస్‌లో చేరి పార్టీలో గుర్తింపు తెచ్చుకున్న రేవంత్ రెడ్డి మూడేళ్లకు టీపీసీసీ పగ్గాలను చేపట్టారు. రేవంత్ దూకుడును గుర్తించిన పార్టీ అధిష్టానం సీనియర్లను కాదని పార్టీ బాధ్యతను అప్పగించింది. కాగా, రేవంత్ రెడ్డి 2018లో కొడంగల్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం 2019 లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి కాంగ్రెస్ టికెట్ దక్కించుకొని ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. దీంతో కొంత దూకుడు పెంచారు. అయితే రేవంత్ పార్టీ అధ్యక్ష పదవి చేపట్టడంతో పార్టీ కార్యకర్తల్లో నూతనోత్సాహం వచ్చినట్లయిందని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు.

అయితే పార్టీలో కొంత మంది సీనియర్లు పార్టీపైనే తిరుగుబాటు జెండా ఎగురవేస్తుండటం, కలిసేందుకు కూడా రేవంత్ రెడ్డికి సమయం కేటాయించకపోవడం, మీడియా ముందు రేవంత్ కు పార్టీని నడిపే అనుభవం లేదని, ఆయన ఒక పిల్లాడు అని ప్రకటనలు చేస్తూ గాడి తప్పుతున్న కాంగ్రెస్‌ను రేవంత్ ఎలా అదుపులో పెడుతారనేది చూడాలి.

నామ నాగేశ్వర్ రావు కూడా 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను పోటీ చేసి విజయం సాధించారు. ఇలా పలువురు నేతలు పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచి రాజకీయాల్లో తమదైన ముద్రవేసుకున్నారు. ఏదీ ఏమైనప్పటికీ అసెంబ్లీలో ఓడిపోయిన నేతలు పార్లమెంట్ లో విజయం సాధించి ఆయా పార్టీల్లో కీలక పాత్రను పోషిస్తున్నారు.

Next Story

Most Viewed