College Admissions: గుర్తింపు ఉన్న కళాశాలల జాబితే లేదు.. కానీ అడ్మిషన్లకు సై

by  |
Inter First Year Admissions
X

దిశ, తెలంగాణ బ్యూరో : పదవ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు ఒరిజినల్ మార్కుల జాబితా లేకుండానే ఇంటర్ ఫస్టియర్‌లో చేరవచ్చని ఇంటర్ బోర్డు ప్రకటించినా ఆచరణలో మాత్రం అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ నెల 30వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్నందున అప్పటిదాకా అడ్మిషన్ల కోసం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రోడ్డెక్కడంలో సమస్యలు ఉన్నాయి.

అడ్మిషన్ కోసం జూలై 5వ తేదీ వరకు గడువు ఉన్నప్పటికీ ఆన్‌లైన్ క్లాసులు జూన్ 1వ తేదీ నుంచే మొదలవుతున్నందువల్ల అప్పటికల్లా ఫస్టియర్‌లో చేరడంలో ఆచరణాత్మక చిక్కులు ఎదురవుతున్నాయి. మరోవైపు గుర్తింపు పొందిన కళాశాలలపై స్పష్టత లేకుండా తమ పిల్లలను ఎలా చేర్పించగలమని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.

ఇలాంటి ఆచరణాత్మక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకోకుండా ఇంటర్మీడియెట్ బోర్డు అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల చేయడం అనేక సందేహాలను లేవనెత్తింది. లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వమే పోలీసులకు, జిల్లా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినందున రోడ్డెక్కడం ఇబ్బందికరంగా మారిందని తల్లిదండ్రులు వాపోతున్నారు. పదవ తరగతి చదివిన పాఠశాలకు వెళ్ళాల్సిన అవసరం లేకపోయినా ఫస్టియర్ చేర్పించాలంటే కళాశాల దాకా వెళ్ళాల్సిన అవసరం ఏర్పడుతోంది. దీంతో మే 30వ తేదీ వరకు అడ్మిషన్ల ప్రక్రియ ముందుకు సాగే అవకాశం లేదని తల్లిదండ్రుల అభిప్రాయం.

గుర్తింపే లేకుండా ఎలా చేరాలి?

ప్రతీ ఏటా విద్యా సంవత్సరం ప్రారంభంలోనే అడ్మిషన్ల ప్రక్రియ మొదలయ్యే సమయానికి రాష్ట్రంలో గుర్తింపు పొందిన కళాశాలల జాబితాను ఇంటర్ బోర్డు అధికారులు వెబ్‌సైట్‌లో ప్రదర్శించడం ఆనవాయితీ. దానికి అనుగుణంగా ఏ కళాశాలకు గుర్తింపు ఉందో తెలుసుకుని విద్యార్థులను వారి తల్లిదండ్రులు చేర్పిస్తుంటారు. కానీ ఈ సంవత్సరం ఆ జాబితాపై ఇంకా స్పష్టత లేదు. కళాశాలల యాజమాన్యాలు దరఖాస్తు చేసుకున్న తర్వాత ఫిజికల్‌గా బోర్డు అధికారులు తనిఖీలు చేసి సిఫారసు చేసిన అనంతరం బోర్డు అనుమతి ఇవ్వడంపై నిర్ణయం తీసుకుంటుంది. కానీ ఈసారి అలాంటి జాబితా లేకుండానే విద్యార్థులను చేర్చాల్సిందిగా బోర్డు నోటిఫికేషన్ జారీ చేయడాన్ని తల్లిదండ్రులు తప్పుపడుతున్నారు.

గుర్తింపు పొందిన కళాశాల వివరాలు లేకుండా చేర్పించినట్లయితే పరీక్షలు రాసే సమయానికి ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెలువడి విద్యార్థులు నష్టపోవడంతోపాటు, ఒక సంవత్సరం వృథా అవుతుందని పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది సైతం అడ్వాన్సుడు సప్లిమెంటరీ పరీక్షలు రాయాల్సి వచ్చిందని ఒక విద్యార్థి పేరెంట్ గుర్తుచేశారు.

వేలాది రూపాయల ఫీజులు కట్టి చేరిన పది నెలల తర్వాత పరీక్షలు రాసే సమయానికి గుర్తింపు లేదంటూ బోర్డు ప్రకటన జారీ చేస్తే ఫలితం ఏముంటుందన్న ప్రశ్నకు అధికారుల నుంచి సమాధానం లేదు. హడావిడిగా నోటిఫికేషన్ జారీ చేసి ఐదు రోజుల్లోనే అడ్మిషన్ ప్రక్రియ కొనసాగుతుండగానే ఆన్‌లైన్ క్లాసుల్ని మొదలుపెట్టాలని తీసుకున్న నిర్ణయాన్ని పేరెంట్స్ తప్పుపడుతున్నారు.

ఆర్థిక సమస్యలతో అడ్మిషన్లు సాధ్యమేనా?

కరోనా కారణంగా గతేడాది ఎదుర్కొన్న తరహా ఇబ్బందులనే ఇప్పుడు కూడా ఎదుర్కొంటున్నామని, అకడమిక్ క్యాలెండర్, పిల్లల చదువుల విషయంలో చాలా గందరగోళం ఉందని మరో పేరెంట్ వ్యాఖ్యానించారు. కరోనా కారణంగా గతేడాది నుంచి ఉద్యోగాల్లేక, అరకొర జీతాలతో నెట్టుకొస్తున్న దిగువ మధ్య తరగతి కుటుంబాలకు ఆర్థిక చిక్కులు ఎదురవుతున్నాయి. అడ్మిషన్ల కోసం వేలాది రూపాయలను ఫీజులు, పుస్తకాలు, డ్రెస్సులు, ఆన్‌లైన్ తరగతులకు ఉపకరణాల కొనుగోలు లాంటి వాటికి సమకూర్చుకోవడం అన్నింటికంటే ప్రధానమని గుర్తుచేశారు. అకస్మాత్తుగా ఫస్టియర్ అడ్మిషన్ల నోటిఫికేషన్ జారీ చేయడం, లాక్‌డౌన్‌తో రోడ్డెక్కలేకపోవడం లాంటి సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు.

కార్పొరేట్ ఫీజుల కోసమే అడ్మిషన్లు..

ఒకవైపు కరోనా తీవ్రత ఇంకా కొనసాగుతుండగానే ఫస్టియర్ ఇంటర్ కోసం అడ్మిషన్ నోటిఫికేషన్ జారీ చేయడం సమంజసం కాదు. కేవలం కార్పొరేట్ విద్యా సంస్థలు ఫీజుల పేరుతో వేలాది రూపాయలు దండుకోడానికి అవకాశం కల్పించడం కోసమే ఈ నోటిఫికేషన్. హడావిడిగా జారీ చేయడం ఇందుకోసమే. గతేడాది విద్యా సంవత్సరం మొత్తం నష్టపోయిన విద్యార్థులకు బ్రిడ్జి కోర్సు నిర్వహించడమే లేదు. వారి తెలివితేటలను, సామర్థ్యాన్ని అంచనా వేయకుండా ఆన్‌లైన్ ద్వారా విద్యాబోధన చేయడం ఫలితాలు ఇవ్వదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో విద్యకంటే ఆర్థిక సమస్యలు ప్రధానం. కుటుంబంలో ఆదాయాన్ని ఆర్జించే వ్యక్తి చనిపోవడంతో పిల్లల చదువులు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారాయి. విద్యావేత్తలతో మీటింగ్ పెట్టకుండానే నోటిఫికేషన్ వచ్చేసింది.
– వెంకట్, పేరెంట్స్ అసోసియేషన్ ప్రతినిధి

Next Story

Most Viewed