ఒమిక్రాన్ వేరియంట్‌పై TS సర్కార్ సంచలన ప్రకటన

by  |
ఒమిక్రాన్ వేరియంట్‌పై TS సర్కార్ సంచలన ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: దక్షిణాఫ్రికాలో బయటపడ్డ ‘ఒమిక్రాన్‌ వేరియంట్‌’ ప్రపంచ దేశాలను మరింత ఆందోళనకు గురి చేస్తోంది. దీనిపై ఇప్పటికే ప్రపంచ దేశాలు అప్రమత్తం అయ్యాయి. తాజాగా.. తెలంగాణ ప్రభుత్వం సైతం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖను అప్రమత్తం చేసింది. ఇప్పటికే సంబంధిత అధికారులతో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు సమీక్ష నిర్వహించారు. అనంతరం ఈ మేరకు ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. కరోనా థర్డ్ వేవ్ వచ్చిన ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేసింది. ఒమిక్రాన్ వైరస్ కొన్ని దేశాల్లో మాత్రమే వ్యాపిస్తోందని, డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ 30 శాతం తీవ్రత ఎక్కువగా ఉంటుందని వెల్లడించింది. కావున రాష్ట్ర ప్రజలు గతంలో కంటే మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

యూరప్ దేశాల నుంచి వస్తోన్న వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వేరియంట్ ఏదైనా సరే కొవిడ్ నుంచి మనల్ని కాపాడేది వ్యాక్సినే అని స్పష్టం చేశారు. రెండు డోసులు తీసుకుంటేనే పూర్తి రక్షణగా ఉంటామని సూచించారు. గుంపులుగా ఉండొద్దని, ఇప్పటినుంచే ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. మాస్కు తప్పనిసరిగా వాడాలని, భౌతికదూరం పాటించాలని సూచించారు. యూరప్ దేశాల్లో వ్యాక్సిన్ తీసుకోని వాళ్లే ఇప్పుడు కొవిడ్ బారిన పడుతున్నారని తెలిపారు. స్వీయ నియంత్రణ, స్వీయ జాగ్రత్తలే మనల్ని రక్షిస్తాయని అన్నారు. సింగిల్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లందరూ.. వెంటనే సెకండ్ డోస్ కూడా తీసుకోవాలని సూచనలు చేశారు. కొవిడ్ పూర్తిగా కనుమరుగు అయ్యిందని అనుకోవద్దని తెలిపారు.



Next Story

Most Viewed