‘సెకండ్ వేవ్’ కాదు.. ‘కరోనా సునామీ’

by  |
‘సెకండ్ వేవ్’ కాదు.. ‘కరోనా సునామీ’
X

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాట్లు ఆశించిన స్థాయిలో లేవని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రస్తుతం మనం దీన్ని ’కరోనా సెకండ్ వేవ్‌’గా పిలుస్తున్నామని, కానీ ఇది ’కరోనా సునామీ’ అని వ్యాఖ్యానించింది. మే నెలలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రత, కేసుల సంఖ్య పెరగడం మరింత ఎక్కువవుతుందనే పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వ సన్నాహక చర్యలు ఎలా ఉన్నాయని శనివారం విచారణ సందర్భంగా ప్రశ్నించింది. కరోనా కారణంగా మృతి చెందుతున్నవారి సంఖ్యను తగ్గించడానికి ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వంతోపాటు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ నెల 21వ తేదీన జరిగిన విచారణ సందర్భంగా ప్రతీ రోజు 480 టన్నుల ఆక్సిజన్‌ను అందుబాటులోకి తెస్తామని, సరఫరా చేయగలుగుతామని చెప్పారని, కానీ ఎంత మేరకు సాధ్యమైందని కేంద్ర ప్రభుత్వ తరపున న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది.

వివిధ ప్రాంతాలనుంచి క్రయోజెనిక్ టాంకర్లను ఢిల్లీ ప్రభుత్వం సమకూర్చుకోవడానికి వీలైన అన్ని మార్గాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో అన్వేషించాలని హైకోర్టు ఆదేశించింది. ఆక్సిజన్‌ను సరఫరా చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం కోరిన సమయంలో సమన్వయం గురించి హైకోర్టు వ్యాఖ్యానించడం గమనార్హం. టాంకర్లను అందించగలిగినట్లయితే దానిని ఆక్సిజన్‌తో నింపి ఇవ్వగలమని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం స్పష్టం చేసింది.

Next Story