పైసలిస్తేనే పర్మిషన్.. రెచ్చిపోతున్న కౌన్సిలర్లు

by Sridhar Babu |
పైసలిస్తేనే పర్మిషన్.. రెచ్చిపోతున్న కౌన్సిలర్లు
X

దిశ, కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా శరవేగంగా అభివృద్ధి చెందుతుంటే.. పేద, మధ్యతరగతి ప్రజలు అభివృద్ధికి అందనంత దూరంలోనే మిగిలి ఉన్నారు. భద్రాద్రి కొత్తగూడెం నూతన జిల్లాగా ఏర్పడినప్పటి నుంచి భూముల ధరలు బుల్లెట్ వేగంతో ఆకాశాన్నంటాయి. ధరలు పెరిగాయని ఆర్థికంగా స్థిరపడని కొంతమంది ప్రజలు స్థలాలు అమ్ముకుంటే,మరో కొంతమంది మాత్రం తమ సొంత ఇంటి కల సాకారం చేసుకోవడానికి రేయింబవళ్లు కష్టపడి రూపాయి రూపాయి కూడ పెట్టి రెండు, మూడు గదులతో ఇంటి నిర్మాణాలు చేపడుతున్నారు. కూడపెట్టిన డబ్బులు చాలక అప్పులపాలై మరి తమ సొంతింటి కల సాకారం చేసుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మున్సిపాలిటీ పరిధిలో ఇంటి నిర్మాణం చేపట్టాలంటే మున్సిపల్ అధికారుల అనుమతులు తప్పనిసరి. ఈ నిబంధనే జిల్లాలో మున్సిపల్ కౌన్సిలర్లకు వరంగా మారింది.

ఇంటి నిర్మాణానికి కౌన్సిలర్ దీవన తప్పనిసరి

ఇంటి నిర్మాణం ఎంత చిన్నదైనా, పెద్దదైనా అధికారుల అనుమతి ఉన్నా,, లేకున్నా,, స్థానిక కౌన్సిలర్ దీవెన ఉంటే కానీ ఇల్లు నిర్మాణం పూర్తయ్యే అవకాశమే లేదు. మున్సిపల్ నిబంధనల ప్రకారం ఇంటి నిర్మాణానికి ముందే మున్సిపాలిటీలో అనుమతుల కొరకు దరఖాస్తు చేసుకోవాలి. అనుమతి లభించిన తర్వాత మాత్రమే నిర్మాణ పనులు మొదలు పెట్టాల్సి ఉంటుంది. కానీ ఇంటి నిర్మాణం కొరకు దరఖాస్తు చేసుకొని నెలలు గడుస్తున్నా అనుమతి లభించకపోవడంతో చేసేదేమీ లేక స్థానిక వార్డు కౌన్సిలర్లను ఆశ్రయిస్తున్నారు. అసలు విషయం ఏంటంటే.. ఆ అనుమతులు రాకపోవడానికి అసలు సూత్రధారులు కౌన్సిలర్ లే. ఈ కౌన్సిలర్లు అధికారులతో కుమ్మక్కై ఇంటి నిర్మాణ అనుమతులు రాకుండా అడ్డుకొని చుట్టూ తిరిగి స్థానిక వార్డు కౌన్సిలర్లను ఆశ్రయించేలా చేయడమే అసలు లక్ష్యం.

ఇక ఇంటి నిర్మాణం ఎలా చేయాలి అని కౌన్సిలర్ వద్దకు వచ్చిన యజమానికి కౌన్సిలర్ ఇలా గీతోపదేశం చేస్తాడు. మీరు ఇల్లు నిర్మాణం పూర్తి చేయాలంటే చాలా పెద్ద తతంగం ఉంటుంది కానీ సంబంధిత అధికారి మన వాడే నేను చెప్తే వింటాడు. కానీ కొంత ఖర్చవుతుంది.. ఓకే అంటే మీరు రేపే పని మొదలు పెట్టవచ్చు’ అని తన మనసులోని మాటను వెళ్లగక్కుతాడు. అర్థం చేసుకున్న బాధితుడు ఎంత అవుతుంది అన్న ప్రశ్నకు సమాధానంగా గజానికి రూ.200 నుండి రూ.1000 వరకు అవకాశాన్ని బట్టి ఈ వ్యవహారాన్ని గుట్టుచప్పుడు కాకుండా ముగిస్తాడు..

అధికారుల పనితీరు అంతంత మాత్రమే..

ఇంటి నిర్మాణ అనుమతుల కోసం నెలల తరబడి ఎదురు చూసినా.. అధికారులు ఏ మాత్రం పట్టించుకున్న పాపాన పోవడం లేదు. సామాన్యులు చెప్పులరిగేలా తిరిగినా పట్టించుకోని వీరు ప్రజా ప్రతినిధుల ఫోన్ కాల్ కి మాత్రం తక్షణమే స్పందిస్తున్నారు. అనుమతులు లేని నిర్మాణాలపై ఈ మధ్య కాలంలో జిల్లా కలెక్టర్ సీరియస్ అవ్వడంతో సంబంధిత అధికారులు జెట్ స్పీడ్ లో భవనాలను కూల్చుతామ్ అంటూ బయలుదేరారు. కొన్ని భవనాలకు రంధ్రాలు చేసి మరో కొన్ని భవనాలకు హెచ్చరికల బోర్డులు తగిలించి మమ అనిపించారు. ఒక ఇంటి నిర్మాణానికి నాలుగు నెలల నుండి కనీసం సంవత్సర కాలం పడుతుంది. కానీ భవనం పూర్తి నిర్మాణం అయ్యేంతవరకు అధికారులు చూడలేదా? స్థానిక ప్రజాప్రతినిధుల మాట తీయలేక వదిలేశారా? అంటూ పట్టణం లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఈ నిర్మాణాలు అన్ని కౌన్సిలర్లు స్థానిక ప్రజాప్రతినిధుల కనుసన్నల్లోనే జరుగుతున్నాయన్న వాస్తవం పట్టణ ప్రజలకు తెలియంది కాదు. జిల్లా వ్యాప్తంగా ఓటు వేసి గెలిపించిన ప్రజల కోసం కొంత మంది కౌన్సిలర్లు నిబద్ధతతో పని చేస్తుంటే.. మరో కొంతమంది మాత్రం తమ స్వప్రయోజనాలకు ఇలా పదవులను అడ్డం పెట్టుకొని లాభాపేక్షతో పని చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు సామాన్యుల గృహ నిర్మాణ అనుమతులు నేరుగా యజమానికి ఇవ్వగలిగితే ప్రజలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి తోడ్పడిన వారవుతారని అనేకమంది అభిప్రాయపడుతున్నారు.



Next Story

Most Viewed